దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ అవార్డుకు నామినేట్ అయ్యారు. గత పదేళ్లుగా క్రికెట్ వరల్డ్ను ఏలుతున్న విరాట్ను మెన్స్ కేటగిరీలో ఐదు అవార్డులకు ఐసీసీ నామినేట్ చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ పురస్కారం కోసం కోహ్లీ, అశ్విన్తో పాటు జో రూట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా), కుమర సంగక్కర (శ్రీలంక) బరిలో నిలిచారు. మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ కేటగిరీలో కోహ్లీతో పాటు ఇండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యారు. లసిత్ మలింగ (శ్రీలంక), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), డివిలియర్స్, సంగక్కర కూడా పోటీ పడుతున్నారు. ఇక, మెన్స్ టీ 20 ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ అవార్డు కోసం కోహ్లీ, రోహిత్ నామినేట్ అయ్యారు. టెస్టు ప్లేయర్ రేసులో ఇండియా నుంచి విరాట్ ఒక్కడే ఉన్నాడు. అయితే, ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కేటగిరీలో కోహ్లీతో పాటు ధోనీ కూడా బరిలో నిలిచాడు.
రెండు అవార్డుల రేసులో మిథాలీ
ఇండియా మహిళల వన్డే టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ రెండు అవార్డులకు నామినేట్ అయింది. వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ అవార్డుకు నామినేట్ అయిన మిథాలీ.. వన్డే ప్లేయర్ అవార్డులో ఇండియా స్టార్ పేసర్ జులన్ గోస్వామితో కలిసి బరిలో నిలిచింది. పురుషులు, మహిళల్లో కలిపి మొత్తం ఏడు కేటగిరీల్లో అవార్డుల ఫైనల్ విన్నర్స్ను ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు.