డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఏమైనయ్ ?

డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఏమైనయ్ ?

ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోతున్న సీఎం కేసీఆర్ ను మించిన అబద్ధాలకోరు మరొకరు లేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమయ్యాయో బదులివ్వాలని కేసీఆర్ ను  ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో ప్రారంభమైన ‘ప్రజా గోస, బీజేపీ భరోసా యాత్ర’లో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగాపురం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం  ప్రజలను ఉద్దేశించి  మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం వల్ల విలువైన ప్రజా సంపద ఆవిరైందన్నారు.

‘‘ ఇటీవల వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ లు మునిగిపోయినయ్. రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది’’ అని వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. ‘‘సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అవినీతి సరిపోక.. ఢిల్లీలో కూతురి ద్వారా లిక్కర్ స్కాం కూడా చేయించారు’’ అని ఆరోపించారు.  ప్రజల్ని తాగుబోతులుగా మార్చి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తనని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఎన్నికల తర్వాత కొడుకును ఎలా సీఎం చేయాలనే దానిపై దృష్టిపెడుతున్నాడని  వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎన్నికలో ఓడిపోయిన కూతురు కవితను..ఎమ్మెల్సీగా చేసుకొని శాసన మండలికి కేసీఆర్ పంపారని గుర్తుచేశారు.  ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ పంచిపెట్టే డబ్బులకు లొంగొద్దని ప్రజలను ఆయన కోరారు. కాళేశ్వరం నీటిని కూడా కేసీఆర్ ఫామ్ హౌజ్ కే సరఫరా చేసుకుంటున్నారని చెప్పారు.