
మహబూబాబాద్ జిల్లా: బీజేపీ బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రులు డీకే ఆరుణ, పెద్దిరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ రాజకీయం చేస్తున్నారని అన్నారు వివేక్ వెంకటస్వామి. “నా పేరుండాలి నా బొమ్మ ఉండాలనే పిచ్చితోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు చేస్తున్నాడు. యాదగిరి గుట్ట ఆలయంలో కేసీఆర్ బొమ్మలు తీసివేసేలా బీజేపీ ప్రభుత్వం మెడలు వంచింది. ఉద్యమకారులను పక్కన బెట్టి ప్రగతి భవన్ లో కప్పు సాసర్లు మోసే వారికి కేసీఆర్ పదవులు ఇచ్చారు. రానున్న రోజుల్లో హరీష్ ను, ఆయన ఇమేజ్ ను వాడుకునేందుకే కేసీఆర్ మంత్రిపదవి మళ్లీ ఇచ్చారు. కేసీఆర్ పెద్ద స్వార్ధ పరుడు. కాళేశ్వరంలో కమీషన్లకోసమే అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులతో.. హరీష్ రావుకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఆయనకు ఆర్థిక శాఖ ఇచ్చారు. 5 నెలల కిందట వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేస్తే 7 ఎంపీ పదవులు కోల్పోయి కేటీఆర్ ఫెయిల్ అయ్యారు. కేటీఆర్ ప్రమోషన్ గా మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ గా మహిళను నియమిచడంతో కేసీఆర్ భయపడి మహిళకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. కవితకు ఢిల్లీలో పోస్టు ఇస్తారట” అని చెప్పారు వివేక్.