వెలుగు ఓపెన్ పేజీ : పట్టణ దిశను మలిచే నిశ్శబ్ద నిర్ణయం

వెలుగు ఓపెన్ పేజీ :  పట్టణ దిశను మలిచే నిశ్శబ్ద నిర్ణయం

తెలంగాణలో  మున్సిపల్  ఎన్నికలు  జరగబోతున్నవేళ.. ఓటరు ముందున్న క్షణం సాధారణ రాజకీయ సందర్భం కాదు.  అది పట్టణ  జీవన  భవిష్యత్తును నిశ్శబ్దంగా నిర్ణయించే ఒక బాధ్యతాయుతమైన సందర్భం. భారీ సభలు, నినాదాల హోరు,   ప్రచార శబ్దం అన్నీ ఆగిన తరువాత, ఓటరు ఒంటరిగా బ్యాలెట్ ముందు నిలిచే ఆ క్షణంలో నిజమైన  ప్రజాస్వామ్యం  మాట్లాడుతుంది. ఆ క్షణంలో ఓటరు  తీసుకునే  నిర్ణయం, ఐదేళ్ల పట్టణ జీవన అనుభవాన్ని  ప్రభావితం చేస్తుంది.  మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా పెద్ద రాజకీయ చర్చల మధ్య చిన్నవిగా కనిపించవచ్చు.  కానీ,  వాస్తవానికి ఇవే ప్రజల దైనందిన జీవితానికి అత్యంత దగ్గరైన ఎన్నికలు. వీధి శుభ్రత,  తాగునీరు,  డ్రైనేజీ,  వీధిలైట్లు, పార్కులు, మార్కెట్లు, బస్టాండులు,  పాఠశాలలు  ఇవన్నీ మున్సిపాలిటీ  పరిధిలోని అంశాలే.  ఇవి సక్రమంగా ఉండాలంటే, ఓటరు తన నిర్ణయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 ఓటర్ల బాధ్యత

మున్సిపల్​ ఎన్నికల  సందర్భంలో ఓటరు ముందు నిలిచే  ప్రధాన ప్రశ్న   ‘నేను ఎవరికి ఓటు వేస్తున్నాను?.  అయితే  ‘నేను ఎందుకు ఓటు వేస్తున్నాను అన్నదే కీలకం.  ఓటు కేవలం ఒక నిర్ణయం కాదు.  అది ఒక ఆశ.   పట్టణం అభివృద్ధి పథంలోకి మారాలంటే  భావోద్వేగాలకు అతీతంగా ఓటర్లు ఆలోచన చేయడం అవసరం.  వ్యక్తిగత పరిచయాలు, తాత్కాలిక హామీలు, ఎక్కువగా వినిపించే మాటలు ఇవన్నీ క్షణికమైనవి.  కానీ, ఓటు ప్రభావం మాత్రం ఐదేండ్లు ఉంటుంది.  మంచి ఫలితాలను ప్రజలు గ్రహించాలంటే, ముందుగా  అభ్యర్థి పాత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలి.  మున్సిపల్  ప్రతినిధి  అంటే  పెద్ద మాటలతో ప్రసంగించే వ్యక్తి మాత్రమే కాదు.  పట్టణ  సమస్యలను వినగలగడం, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడం , ప్రజలతో నిరంతర సంబంధం ఉంచడం.. ఇవన్నీ అతని బాధ్యతలు. ఈ లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయో గమనించడం  ఓటర్ల బాధ్యతగా గుర్తించాలి. 

అభివృద్ధిపై స్పష్టత

ఇంకొక ముఖ్యమైన అంశం.. అభివృద్ధి అంటే ఏమిటన్న దానిపై  ఓటర్లకు  స్పష్టత ఉండాలి.   అభివృద్ధి అనేది కేవలం  భవనాలు, రహదారులు మాత్రమే కాదు.  శుభ్ర మైన వాతావరణం, సురక్షితమైన  ప్రజాస్థలాలు, అందు బాటులో ఉండే ప్రభుత్వ సేవలు కూడా అభివృద్ధిలో భాగమే. ఈ దృష్టితో ఆలోచించినప్పుడు మాత్రమే ఓటు విలువ  తెలుస్తుంది.  ఓటరు తీసుకోవాల్సిన మరో జాగ్రత్త.. పోలింగ్ రోజు వరకు వినిపించే మాటలను తూకం వేయడం.   ప్రతి మాటను  నమ్మడం కాదు,  ప్రతి వాగ్దా నాన్ని  తిరస్కరించడం కూడా కాదు.  సాధ్యాసాధ్యాలను గుర్తించి,  వాస్తవానికి దగ్గరగా ఉన్న మాటలను గుర్తించడం ఓటరు  పరిపక్వతకు నిదర్శనం. ఈ పరిపక్వతే పట్టణ  పాలనను స్థిరంగా ఉంచుతుంది.  మున్సి పల్ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ప్రజలు కేవలం ఓటు హక్కును వినియోగించటం కాదు, తమవంతు బాధ్యతను కూడా  స్వీకరిస్తున్నారని  తెలుసుకోవాలి. 

ప్రజాచైతన్యంతోనే ఎన్నికలు అర్థవంతం

ఓటు వేసిన తరువాత మౌనంగా ఉండిపోవడం కాదు, ఎప్పటికప్పుడు  ప్రశ్నించగలగడం, సూచనలు ఇవ్వగలగడం  కూడా ఓటరు పాత్రలో భాగమే.  ప్రజల చైతన్యంతోనే  ఎన్నికల ఫలితాలు అర్థవంతంగా మారుతాయి. ఈ ఎన్నికల  సందర్భంలో  పట్టణ ఓటరు  ఒక  విషయం  గుర్తుంచుకోవాలి.  తన నిర్ణయం ఒంటరిది కాదు.  అది సమష్టి నిర్ణయంలో భాగం.  ప్రతి ఓటు కలిసి ఒక పట్టణ స్వరూపాన్ని మారుస్తుంది.  ఆ స్వరూపం శుభ్రంగా, సక్రమంగా,  మానవీయంగా ఉండాలంటే  ప్రతి ఓటరు తన బాధ్యతను  నిజాయితీగా నిర్వర్తించాలి.  మున్సిపల్ ఎన్నికలు మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే.   ప్రజాస్వామ్యం పెద్ద మాటల్లో కాదు, చిన్న నిర్ణయాల్లో ఉంటుంది.  ఆ చిన్న నిర్ణయం  సరిగా  తీసుకున్నప్పుడు  పట్టణ జీవితం నెమ్మదిగా,  స్థిరంగా మెరుగుపడుతుంది.  ఓటువేసే ఆ నిశ్శబ్ద క్షణంలో  ఓటరు తన పట్టణ భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ చేతులు ఆలోచనతో నిండినవై ఉండాలని ఆశిద్దాం.

- చిటికెన 
కిరణ్ కుమార్,
ఎనలిస్ట్​