రూ.24 కోట్లు ఎగొట్టి పరార్.. వీఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్‌ ఎండీ అరెస్ట్

రూ.24 కోట్లు ఎగొట్టి పరార్..  వీఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్‌ ఎండీ అరెస్ట్

హైదరాబాద్‌: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ  వీఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్‌ ఎండీ నగునూరి రాజేష్ ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.  జనాల నుంచి దాదాపు రూ. 24 కోట్లు వసూలు చేసి పరారైన రాజేష్ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అధిక మొత్తంలో వడ్డీలు ఇస్తానంటూ.. వందల మంది నుంచి ప్లాట్లు, డిపాజిట్ల పేరుతో రాజేష్ డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ ను ఆశ్రయించారు.

తమ నుంచి కోట్ల రూపాయలు వసూల్ చేసి మోసం చేశాడని నగనూరి రాజేష్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన పోలీసులు ఈరోజు రాజేష్ పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించిన దర్యాప్తు చేపట్టారు.