బీజేపీ vs కాంగ్రెస్ .. పరేడ్​ గ్రౌండ్పై​ వార్

బీజేపీ vs కాంగ్రెస్ ..   పరేడ్​ గ్రౌండ్పై​ వార్

హైదరాబాద్, వెలుగు:  పరేడ్ గ్రౌండ్​పై రాజకీయ దుమారం కొనసాగుతున్నది. సెప్టెంబర్​17న పరేడ్​గ్రౌండ్​లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్​పార్టీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను తలపెట్టింది. ఈ సభను పరేడ్​గ్రౌండ్​లో నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈ నెల 2న రక్షణ శాఖకు కాంగ్రెస్​ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, దానిపై కేంద్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమకు గ్రౌండ్​ ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఆరోపించారు. 

నిరుటి లెక్కనే కేంద్రం వేడుకలు


స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 2022 సెప్టెంబర్​17న కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పరేడ్​గ్రౌండ్​లో నిర్వహించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి.  వీటికి కొనసాగింపుగా ఈ ఏడాది కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పరేడ్​ గ్రౌండ్​లో వేడుకలు నిర్వహించబోతున్నదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.  

సోనియా సభ కోసం అప్లయ్​ చేసుకొని..

ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్​ కేంద్రంగా కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను పురస్కరించుకొని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్​ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు పీసీసీ ప్లాన్​ చేసింది. పరేడ్ ​గ్రౌండ్​లో పది లక్షల మందితో ఈ నెల 17న సభ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇప్పుడు అదే పరేడ్​ గ్రౌండ్ వేదికగా కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్​సభకు పర్మిషన్​ ఇవ్వడంపై డైలమా నెలకొంది. తాము ముందే సభ పెట్టుకుంటామని అనుమతి కోరినా.. బీజేపీ, బీఆర్ఎస్​ కుట్ర చేశాయని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఆరోపించారు. 

కాంగ్రెస్​ పార్టీని చూసి భయపడే ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, ఉదయం పరేడ్​ గ్రౌండ్​లో విమోచన వేడుకలు నిర్వహిస్తే ఇక తమ సభకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్​ నేతలు ప్రత్యామ్నాయంగా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించే ప్రయత్నాలు షురూ చేశారు. ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకుంటే కొంగరకలాన్​లో సభ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.