
హైదరాబాద్, వెలుగు: పరేడ్ గ్రౌండ్పై రాజకీయ దుమారం కొనసాగుతున్నది. సెప్టెంబర్17న పరేడ్గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్పార్టీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను తలపెట్టింది. ఈ సభను పరేడ్గ్రౌండ్లో నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈ నెల 2న రక్షణ శాఖకు కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, దానిపై కేంద్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమకు గ్రౌండ్ ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు.
నిరుటి లెక్కనే కేంద్రం వేడుకలు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 2022 సెప్టెంబర్17న కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పరేడ్గ్రౌండ్లో నిర్వహించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి. వీటికి కొనసాగింపుగా ఈ ఏడాది కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించబోతున్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
సోనియా సభ కోసం అప్లయ్ చేసుకొని..
ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను పురస్కరించుకొని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు పీసీసీ ప్లాన్ చేసింది. పరేడ్ గ్రౌండ్లో పది లక్షల మందితో ఈ నెల 17న సభ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇప్పుడు అదే పరేడ్ గ్రౌండ్ వేదికగా కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్సభకు పర్మిషన్ ఇవ్వడంపై డైలమా నెలకొంది. తాము ముందే సభ పెట్టుకుంటామని అనుమతి కోరినా.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేశాయని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని చూసి భయపడే ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, ఉదయం పరేడ్ గ్రౌండ్లో విమోచన వేడుకలు నిర్వహిస్తే ఇక తమ సభకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రత్యామ్నాయంగా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించే ప్రయత్నాలు షురూ చేశారు. ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకుంటే కొంగరకలాన్లో సభ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.