
- హాజరు ఆధారంగానే జీతాలు చెల్లింపు
- వందరోజుల కార్యాచరణలో భాగంగా ర్యాలీ
వరంగల్ సిటీ, వెలుగు: శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్ నగర పరిధిలోని 25, 26 డివిజన్లలో చార్ బౌలి ప్రాంతం లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్ నిర్వహణను పరిశీలించి, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జవాన్లు, సిబ్బంది మాన్యువల్ గా సంతకాలు చేయడంతోపాటు బయోమెట్రిక్ హాజరు కూడా ప్రతిరోజు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు నమోదు చేయాలన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే వేతనాల చెల్లింపులు ఉంటాయన్నారు.
వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ గుడి వద్ద గల చౌరస్తా నుంచి చార్ బౌలి వాటర్ ట్యాంక్ వరకు నిర్వహించిన ర్యాలీలో కమిషనర్ పాల్గొన్నారు. స్థానికులతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా అందజేయాలని అవగాహన కల్పించి, కరపత్రాన్ని అందజేసి, స్టిక్కర్ ను గృహాలకు అతికించారు.
చార్ బౌలి వాటర్ ట్యాంక్ ఆవరణలో నిర్వహిస్తున్న డీఆర్ సీసీ సెంటర్ తోపాటు నర్సరీని పరిశీలించి, నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ ను సందర్శించి నిర్వహణ బాగుందని ప్రశంసించారు. ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు మరింత బలోపేతం చేస్తూ మరో ప్లాంటు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సీఎంహెచ్వో డా.రాజారెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.