పొలాలకెళ్లే బాటమాయం .. దారి కబ్జా చేశారని కలెక్టర్కు రాయపర్తి రైతుల ఫిర్యాదు

పొలాలకెళ్లే బాటమాయం .. దారి కబ్జా చేశారని కలెక్టర్కు రాయపర్తి రైతుల ఫిర్యాదు

వరంగల్​, వెలుగు: పొలాలకు వెళ్లే బాట ఏడాదిగా బంద్​ కావడంతో  వరంగల్​ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్​కు వచ్చారు. తమ పొలాలకు వెళ్లే దారి చూపాలని నిరసన వ్యక్తం చేస్తూ, అధికారులు స్పందించాలని నినాదాలు చేశారు.  రాయపర్తి మెయిన్​రోడ్డు నుంచి మారమ్మ గుడి వరకు పంటపొలాలకు వెళ్లేందుకు ఎడ్ల బండి వెళ్లేంత దారి ఉండేది. ఏడాది నుంచి కొందరు వ్యక్తులు ఈ దారి తమ భూమికి చెందినదిగా చెబుతూ మూసివేశారు. 

ఇదే ప్రాంతంలో ఎస్సారెస్పీ చిన్న కాలువ కూడా ఉంది, కాలువ అభివృద్ధి పనులు, మరమ్మతుల కోసం కెనాల్​కు ఇరువైపులా వాహనాలు వెళ్లే దారి ఉంటుంది. ఆ దారి కూడా మాయమవడంతో ఏడాదిగా సాగు పనుల కోసం రైతులు, వారి కుటుంబ సభ్యులు, కూలీలు వెళ్లేందుకు దారి లేదు. ఈ విషయంలో అధికారులు సర్వే చేసి, ఇక్కడ గతంలో ఎడ్లబండి దారి ఉన్నదని చెప్పినా సమస్య పరిష్కరమవలేదు. దీంతో దాదాపు 50 మంది రైతులు కలెక్టరేట్​కు వచ్చారు. కాసేపు నిరసన వ్యక్తం చేసి, కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు. 

ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం నర్సాపూర్​కు చెందిన శ్రీహరి ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​లో కాంట్రాక్ట్​ ఉద్యోగిగా పని చేశాడు. ఐదేండ్ల కింద కాలుపై చిన్నపాటి గడ్డ కావడంతో ములుగులో ఎంబీబీఎస్​ డాక్టర్​ పోరిక రవీందర్​ ఆస్పత్రికి వెళ్లాడు. మందులు ఇచ్చినా తగ్గకపోగా ఇన్​ఫెక్షన్​ అయ్యింది. పరిస్థితి విషమించడంతో వరంగల్​ ఎంజీఎంలో కాలు తీసేశారు. నాలుగు నెలల కింద రెండో కాలుకు అలాగే కావడంతో తన పరిస్థితి రవీందర్​ డాక్టర్​కు తెలుసనే ఉద్దేశంతో ఆయననే సంప్రదించాడు.

 రెండో కాలుకు కూడా ఇన్​ఫెక్షన్​ కావడంతో ఎంజీఎం డాక్టర్లు దానినీ తొలగించారు. రోజుల తరబడి ఇన్​ఫెక్షన్​ గుర్తించక, నిర్లక్ష్యం చేసి కాళ్లుపోవడానికి కారణమైన డాక్టర్​పై చర్యలు తీసుకోవాలని ములుగు కలెక్టర్​కు ఫిర్యాదు చేశాడు. అయితే, సదరు డాక్టర్​ వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలంలో మెడికల్​ ఆఫీసర్​గా విధులు నిర్వహిస్తున్నాడని, చర్యల కోసం వరంగల్​ కలెక్టర్​ను కలవాలని సూచించడంతో శుక్రవారమే వరంగల్​ వచ్చాడు. ఇక్కడ పని చేయాల్సిన సదరు డాక్టర్​ నిబంధనలకు విరుద్ధంగా ములుగు జిల్లాలో ఆస్పత్రి నడుపుతున్నాడని, ట్రీట్​మెంట్​ కోసం వెళితే తన కాళ్లు పోవడానికి కారణమైన అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. 

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాకకు చెందిన ప్రైవేట్‍ ఉద్యోగి లావుడ్యా దేవేందర్‍ కుమారుడు చరణ్‍తేజ్‍ (14)కు పుట్టినప్పుడే కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రభుత్వం నాలుగేండ్ల కింద నుంచి వికలాంగ కోటాలో పెన్షన్‍ ఇస్తుంది. అయితే డాక్టర్లు వైకల్యం సర్టిఫికేట్‍ ఇచ్చే క్రమంలో పర్మినెంట్‍ కాకుండా రెండేళ్ల కోసం టెంపరరీ ఇచ్చారు. దీనిపై వారికి అవగాహన లేదు. మొత్తంగా సర్టిఫికేట్‍ గడువు ముగియడంతో గతేడాది మార్చిలో డియాక్టివేట్‍ అయింది. అప్పటి నుంచి పెన్షన్‍ రావట్లేదు. ఇదే విషయమై అప్పుడే ప్రజావాణిలో కలిసి వినతిపత్రం అందజేసి, పర్మినెంట్‍ వైకల్య సర్టిఫికేట్‍ అందించేలా చూడాలని కోరారు.

జిల్లాల వారీగా వచ్చిన ఫిర్యాదులు..

జనగామ అర్బన్/ ములుగు/ మహబూబాబాద్​/ కాశీబుగ్గ (కార్పొరేషన్)/ హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వరంగల్​ కలెక్టరేట్​లో కలెక్టర్​ సత్యశారద ఫిర్యాదులు స్వీకరించగా, మొత్తం 121 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్​ తెలిపారు. జనగామ కలెక్టరేట్​లో  కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అడిషనల్​ కలెక్టర్లతో కలిసి అర్జీలను స్వీకరించగా, 74 వినతులు వచ్చినట్లు కలెక్టర్​ తెలిపారు. ​ ములుగు కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు మొత్తం 56 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​ దివాకర తెలిపారు. 

మహబూబాబాద్​లో నిర్వహించిన 106 వినతులు వచ్చాయని అడిషనల్​ కలెక్టర్లు వీరబ్రహ్మచారి, లెనిన్​ వత్సల్​ టొప్పో తెలిపారు. వరంతల్​ బల్దియా హెడ్​ఆఫీస్​లో జరిగిన గ్రీవెన్స్​లో కమిషనర్​ చాహత్​బాజ్​పాయ్​ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. హనుకొండలో జరిగిన గ్రీవెన్స్​లో మొత్తం 186 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్​ స్నేహ శబరీశ్​ తెలిపారు. అంతకుముందు ఆమె కలెక్టరేట్​లో గ్రీవెన్స్​ నిర్వహించగా, మండల స్థాయి సమస్యల పరిష్కారానికి ప్రజావాణి అయ్యేంత వరకు ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఇతర మండల స్థాయి ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను వారితో మాట్లాడి సాల్వ్​ చేయాలని సూచించారు.