
- వరంగల్ జిల్లా మెడికల్ కాలేజీని నర్సంపేటకు తరలించిన లీడర్లు
- 10 ఎకరాల స్థలం ఇవ్వక ఆగుతున్న బిల్డింగ్ పనులు
- హాస్పిటల్ బ్లాకుల్లో తాత్కాలికంగా తరగతుల నిర్వహణ
- రాజకీయ జోక్యంతో కలెక్టర్ వద్దనే ఫైల్
వరంగల్/ నర్సంపేట, వెలుగు: వరంగల్ మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి గ్రహణం పట్టింది. రాష్ర్ట ప్రభుత్వం కేటాయించిన వైద్య కళాశాలను నర్సంపేటలో ఏర్పాటు చేసేందుకు లీడర్లు ఉత్సాహం చూపారు. ఆ తర్వాత చేయాల్సిన పనులను మాత్రం గాలికొదిలేశారు. కాలేజీ భవన నిర్మాణానికి కావాల్సిన భూములను అందిస్తామని, ఏడాదిలో బిల్డింగ్ నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పి క్లాసులకు పర్మిషన్ తీసుకువచ్చారు.
ఇప్పటికీ కనీస స్థలాన్ని కూడా సమకూర్చలేకపోయారు. కాలేజీలోని ఎంబీబీఎస్ స్టూడెంట్ల తరగతుల నిర్వహణకు అవసరమైన పారా మెడికల్ ఉద్యోగాలను మంజూరు చేసినా, రాజకీయ జోక్యంతో భర్తీ చేయలేదు. దీంతో అసౌకర్యాల మధ్య తరగతులు నడిపిస్తున్నారు. వైద్యపరంగా ఉన్నత విద్యనందించే మెడికల్ కాలేజీ పనుల్లో అలసత్వంపై విమర్శలు వస్తున్నాయి.
వరంగల్ జిల్లా మెడికల్ కాలేజీ నర్సంపేటకు..
గత ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లాకు మెడికల్ కాలేజీ శాంక్షన్ అయింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన కాలేజీని అప్పటి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తన నియోజకవర్గానికి తరలించేలా అడుగులు వేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది. ప్రస్తుతం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాలేజీ వారి నియోజకవర్గానికే వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పాకాల చెరువు రోడ్డులో కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీలో తరగతుల నిర్వహణకు అందుబాటులో భవనం లేకపోవడంతో అప్పటికే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కోసం ఇక్కడ నిర్మిస్తున్న మూడు బ్లాకుల్లో ఒకదానిని కాలేజీకి చూపించి కావాల్సిన అనుమతులు తెచ్చుకున్నారు.
50 మంది స్టూడెంట్లతో కాలేజీకి అప్రూవల్ వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 19న మంత్రులు దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై హాస్పిటల్తో పాటు కాలేజీని ప్రారంభించారు. రూ.183 కోట్లతో హాస్పిటల్ పూర్తి చేసుకున్నామని, మెడికల్ కాలేజీకి సైతం త్వరలోనే బిల్డింగ్ నిర్మాణం చేపట్టి కాలేజీ అడ్మిషన్లను 150 సీట్లకు పెంచుకుంటామని చెప్పారు. అలాగే నర్సింగ్ కాలేజీ సైతం ఏర్పాటు చేస్తామన్నారు.
భూముల ఎంపికపై నో క్లారిటీ..
గత ప్రభుత్వ హయాంలో నర్సంపేటలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి స్థలం లేకపోవడంతో ఇదే నియోజకవర్గానికి చెందిన దొడ్డ మోహన్రావు పాకాల రోడ్డులో సొంత డబ్బులతో దాదాపు 19 ఎకరాలు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందించాడు. కానీ అక్కడ ఒక్క డబుల్ ఇల్లు కూడా కట్టలేదు. దీంతో ఆ భూములు ప్రజలకు ఉపయోగపడేలా 10 ఎకరాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించారు. మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో ప్రస్తుతం అదే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఓ బ్లాకులో నడిపిస్తున్నారు.
కాలేజీకి పర్మినెంట్ బిల్డింగ్ కోసం కనీసం 10 ఎకరాల భూమి అవసరమవుతుందని భావించగా, ఆస్పత్రి పక్కనే మోహన్రావు ఇచ్చిన భూముల్లో అందుబాటులో ఉన్న 9 ఎకరాలను పరిశీలించారు. ఆ తర్వాత అడుగులు ముందుకుపకడ భూసేకరణ పూర్తి కాలేదు. దీంతో కాలేజీకి సొంత బిల్డింగ్ రాలేదు. దాత ఇచ్చిన భూములను ఓకే చేస్తారా లేదా మరోచోట భూములు కేటాయిస్తారా అనేదానిపై క్లారిటీ లేక ప్రస్తుత 50 ఎంబీబీఎస్ సీట్లు 150కి పెంచుకోవడం ఇప్పట్లో అయ్యేలా లేదు.
కలెక్టర్ టేబుల్పై ఫైల్..
మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన విద్య కోసం సర్కారు టెక్నికల్ విభాగంలో అవసరమైన పారా మెడికల్ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చింది. నర్సంపేటలోని కాలేజీకి సైతం ఔట్ సోర్సింగ్ విధానంలో ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేషన్ అసిస్టెంట్, ఈసీజీ టెక్నిషియన్ వంటి 23 విభాగాల్లో 64 పోస్టులను మంజూరు చేసింది. దాదాపు 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో వీటిని రిక్రూట్ చేయడానికి అవసరమైన ఏజెన్సీని ఓ ప్రజాప్రతినిధి తన అనుచరుడికి ఇప్పించుకున్నట్లు ప్రచారం జరిగింది.
స్థానిక పార్లమెంట్, అసెంబ్లీతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరికివారుగా తమ మనుషులకు పోస్టింగ్ కోసం సిఫారసు చేశారనే ఆరోపణలతో సదరు ఏజెన్సీ క్యాన్సల్ చేసి నవంబర్ లో కొత్త ఏజెన్సీకి ఉద్యోగాల భర్తీ అప్పజెప్పారు. ఎంపికలో మరోసారి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం రోస్టర్ పద్ధతి, కావాల్సిన విధివిధానాలు ఇవ్వడంతో సదరు సంస్థ ప్రొసిజర్ ప్రకారం మెరిట్ జాబితా తయారు చేసి వరంగల్ కలెక్టర్కు అందజేశారు. ఇది జరిగి దాదాపు 6 నెలలు కావస్తున్నా, ఉద్యోగుల తుది ఎంపిక ఫైల్ కలెక్టర్ టేబుల్ పైనే ఉంది. రాజకీయ ఒత్తిళ్లతోనే భర్తీ ఆగుతోందనే ప్రచారం ఉంది. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని, మెడికల్ స్టూడెంట్లు, ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కోరుతున్నారు.