వరంగల్‍ జిల్లాలో దాత ఇచ్చిన భూముల్లోనే ఆస్పత్రి, కాలేజ్

వరంగల్‍ జిల్లాలో దాత ఇచ్చిన భూముల్లోనే ఆస్పత్రి, కాలేజ్
  • హాస్పిటల్‍కు 10 ఎకరాలు, మిగతా 9.37 ఎకరాలు మెడికల్‍ కాలేజీకీ
  • ఇందులోనే 4 ఎకరాలు నర్సింగ్‍ కాలేజీకి..  
  • ఆదేశాలొచ్చాక వచ్చే ఏడాది పారామెడికల్‍ పోస్టులు భర్తీ
  • 2025 - 26 ఏడాదికి సైతం 50 ఎంబీబీఎస్‍ అడ్మిషన్లతోనే నిర్వహణ 
  • వరంగల్‍ కలెక్టర్‍ సత్యశారద, ప్రిన్సిపల్‍  వివరణ

వరంగల్‍/ నర్సంపేట, వెలుగు: వరంగల్‍ జిల్లాకు కేటాయించిన మెడికల్‍ కాలేజీ భవన స్థలంపై క్లారిటీ వచ్చింది. నర్సంపేట నియోజకవర్గంలో మెడికల్​ కాలేజీ ఏర్పాటు చేసి నేపథ్యంలో ఇక్కడ నిర్మించిన జిల్లాస్థాయి హాస్పిటల్‍ పక్కనే అందుబాటులో ఉన్న 9.37 ఎకరాలను మెడికల్‍ కాలేజీకి కేటాయించినట్లు బుధవారం వరంగల్‍ కలెక్టర్‍ సత్యశారద, మెడికల్‍ కాలేజీ ప్రిన్సిపల్‍ డాక్టర్‍ మోహన్‍దాస్‍ తెలిపారు. ఈనెల 8న ‘వీ6, వెలుగు’లో ''మెడికల్‍ కాలేజీకి స్థలం దొరకట్లే.. ఇచ్చిన పోస్టులు కూడా భర్తీ చేయట్లే” శీర్షికన వార్త ప్రచురించింది. ఈ కథనానికి జిల్లా కలెక్టర్‍ స్పందించారు.

గత ప్రభుత్వ హయాంలో నర్సంపేట పట్టణం సర్వాపురం గ్రామ పరిధిలో దొడ్డ మోహన్‍రావు రైతుల వద్ద సేకరించి విరాళంగా ఇచ్చిన 19 ఎకరాల 37 గుంటల భూమిలో నాటి కలెక్టర్‍ గోపి జిల్లా హాస్పిటల్‍ నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించారన్నారు. 2023 సెప్టెంబర్‍లో మిగిలిన 9.37 ఎకరాలను అప్పటి కలెక్టర్‍ ప్రావీణ్య మెడికల్‍ కాలేజీకి కేటాయించారన్నారు. ఆపై నర్సింగ్‍ కాలేజీ మంజూరు కావడంతో మెడికల్‍ కాలేజీ కోసం ఇచ్చిన 9.37 ఎకరాల్లో నుంచి మళ్లీ 4 ఎకరాలను నర్సింగ్‍ కాలేజీ బిల్డింగ్‍ కోసం కేటాయించినట్లు చెప్పారు. మెడికల్‍ కాలేజీ కోసం ఎప్పుడో భూమి కేటాయిస్తే, బిల్డింగ్‍ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని విలేకరులు అడగగా, అది తమ పరిధిలో లేదని తెలిపారు. 

జర్నలిస్టుల భూమి క్యాన్సల్‍..

నర్సంపేటలో దొడ్డ మోహన్‍రావు ఇచ్చిన భూముల్లోనే హాస్పిటల్‍, మెడికల్‍ కాలేజీ, నర్సింగ్‍ కాలేజీతో పాటు సిబ్బంది క్వార్టర్లు కూడా నిర్మించాలని భావిసుతన్నారు. కాగా, 31–5–2023 న ఇవే 19.37 ఎకరాల భూముల్లో స్థానిక జర్నలిస్టుల ఇండ్ల కోసం 2 ఎకరాలు కేటాయించినట్లు అప్పటి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి తెలిపారు. కాగా,  జర్నలిస్టులకు కేటాయించిన భూముల విషయం అప్పటి అధికారులకే తెలుసని చెప్పారు. 

వచ్చే ఏడాదిలోనే కొత్త పోస్టుల భర్తీలు..

రాష్ట్రంలో 2024_25 ఏడాదికి ఇతర మెడికల్‍ కాలేజీలతో పాటే నర్సంపేట మెడికల్‍ కాలేజీకి సాంక్షన్​ చేసిన 62 పోస్టులను జిల్లా అధికారులు భర్తీ చేయలేదు. పోస్టుల  భర్తీ కోసం అందరితో పాటే నోటిఫికేషన్‍ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కొన్ని కారణాలవల్ల హాస్పిటల్‍కు అనుబంధంగా ఉన్న నర్సంపేట, వర్ధన్నపేట పారా మెడికల్‍ సిబ్బందిని మెడికల్‍ కాలేజీలో తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయన్నారు. 2025_26 కి అవపరమయ్యే సిబ్బందిని, ఔట్‍ సోర్సింగ్‍ పద్ధతిలో నియమిస్తామన్నారు. ఈసారి సీట్ల పెంపు లేదన్నారు. మెడికల్‍ కాలేజీ కోసం పూర్తిస్థాయి బిల్డింగ్‍ నిర్మాణం, ఫెసిలిటీస్ ఇతర అంశాలతో సీట్ల పెంపు ఉంటుందన్నారు.