వరంగల్, వెలుగు: చేతిలో చిల్లిగవ్వ లేక సర్కారు వైద్యం కోసం వస్తున్న నిరుపేదలకు అక్కడా డబ్బుతోనే పని పడుతోంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలుసుకోకుండా సిబ్బంది పైసల్ డిమాండ్ చేస్తుండటంతో వైద్యం కోసం వచ్చిన పేషెంట్ల బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏ విభాగంలో చూసినా చేతులు తడిపితేనే పని అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. వెయ్యి పడకల ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంకు పేదల దవాఖానగా పేరుంది. ఇక్కడి ఉచిత వైద్యాన్ని నమ్ముకుని ఉమ్మడి వరంగల్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి నిత్యం వందల మంది వస్తుంటారు. వివిధ వైద్య సేవలు, టెస్టులు, ఆపరేషన్ల కోసం వచ్చేవారితో నిత్యం ఐదారు వందల ఓపీ నమోదవుతోంది. ట్రీట్ మెంట్పరంగా అన్ని విధాలుగా సౌకర్యంగానే ఉన్నా ఇక్కడి సిబ్బంది తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేషెంట్లు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పేషెంట్ను జాయిన్ చేసిన తరువాత శానిటేషన్ వర్కర్స్, పేషెంట్ కేర్ ప్రొవైడర్లు కేవలం వసూళ్ల మీదనే దృష్టి పెడుతున్నారని, ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటుకు వెళ్లలేక ఇక్కడికొస్తే..
ప్రైవేటుకు వెళితే ఏ చిన్న రోగానికైనా పెద్దపెద్ద టెస్టులు రాయడం.. ప్రజల జేబులు ఖాళీ అవ్వడం సాధారణమైపోయింది. దీంతో వైద్యం కోసం చాలామంది సర్కారు దవాఖానకు క్యూ కడుతున్నారు. అయితే ఇక్కడి సిబ్బంది చేసిన సేవలకు రూ.100కు తగ్గకుండా డిమాండ్ చేస్తుండటంతో రోగుల బంధువులు బెంబేలెత్తిపోతున్నారు. ఎంజీఎంలో మొత్తం 100 మంది సెక్యూరిటీ, 194 మంది శానిటేషన్ సిబ్బంది, 100 వరకు పేషెంట్ కేర్ ప్రొవైడర్లు పని చేస్తున్నారు. ఇందులో చాలామంది పేషెంట్ల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండానే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో ఇక్కడ వైద్యమంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
అంబూ పెడితే అంతే..
రోడ్డు ప్రమాదాలు, హార్ట్ స్ట్రోక్లు, ఇతర ప్రమాదాల్లో గాయపడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవారికి అంబూ(అర్టిఫీషియల్ మాన్యువల్బ్రీతింగ్యూనిట్) ద్వారా ఆక్సిజన్అందిస్తారు. అంటే పేషెంట్కు ఆక్సిజన్మాస్క్పెట్టి ఒక ఎయిర్బ్యాగులాంటి దానిని ప్రెస్ చేస్తూ ఉంటే శ్వాస ఆడుతుందన్న మాట. యాక్సిడెంట్లు జరిగిన బాధితులకు అత్యవసర సమయాల్లో దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇలా ఎవరికైనా అంబూ పెట్టాల్సి వస్తే అక్కడి సిబ్బంది వచ్చి అడగకపోయినా సహాయపడతారు. ఆ తరువాత వచ్చి ‘చేతులన్నీ పోవంగ పని చేసినం.. మనిషికో వంద ఇవ్వాల్సిందే’ అని పట్టుబడతారు. ఎవరైనా చనిపోయినా కూడా సిబ్బంది వారిని వదలడం లేదు. మృతదేహాన్ని వాహనంలో ఎక్కించేవరకు వారి వెంటే ఉండి తరువాత వారి బంధువులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణం పోయినా కూడా సిబ్బంది వదలడం లేదని పేషెంట్తాలూకు బంధువులు తలలు పట్టుకుంటున్నారు.
దారి చూపినా అంతే..
హాస్పిటల్లో మొత్తం 104 డిపార్టుమెంట్లు ఉన్నాయి. నిత్యం తిరిగే సిబ్బందికే ఏ డిపార్ట్మెంటు ఎక్కుడుందో చెప్పమంటే కాసేపు ఆలోచించక తప్పని పరిస్థితి. ఇక కొత్తగా చేరిన పేషెంట్ల పరిస్థితి చెప్పనక్కరలేదు. ఎక్స్ రే, స్కానింగ్, మెడిసిన్ మొదలైన వాటికోసం రోగులు తిరగాల్సి వస్తే ఆ పరిస్థితిని కూడా కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. అడ్రస్ చెబుతామంటూ పేషెంట్ బంధువులను తీసుకెళ్లి చూపిస్తారు. తీరా థ్యాంక్స్ చెప్పేలోపే రూ.100 అడుగుతారు. గత బుధవారం నర్సంపేటకు చెందిన ఓ పేషెంట్కు ఇదే పరిస్థితి ఎదురైంది. నిరుపేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు కేవలం నామమాత్రంగా చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. గతంలో ఇలాంటి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కొన్నిచోట్ల ‘హాస్పిటల్ సిబ్బందికి ఎలాంటి లంచాలు ఇవ్వకూడదు’ అని బోర్డులు కూడా పెట్టించారు. అయినా పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు.