ప్లాస్టిక్ కుర్చీల చాటున గంజాయి స్మగ్లింగ్

ప్లాస్టిక్ కుర్చీల చాటున గంజాయి స్మగ్లింగ్
  • వరంగల్​జిల్లాలో ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
  • పరారీలో మరో ఐదుగురు
  • 68 కిలోల గంజాయి స్వాధీనం


హనుమకొండ, వెలుగు: ప్లాస్టిక్​కుర్చీల చాటున ఒడిశా నుంచి ముంబైకి గంజాయిని స్మగ్లింగ్​చేస్తున్న ఇద్దరు యువకులను వరంగల్​టాస్క్​ ఫోర్స్, దేవరుప్పుల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 68 కిలోల గంజాయి, మూడు సెల్​ఫోన్లు, ట్రాలీఆటో స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. టాస్క్​ఫోర్స్​ఏసీపీ మధుసూదన్, ఎస్ బీ ఏసీపీ ఎం.జితేందర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పెద్దరామపురం గ్రామానికి చెందిన కమార్తపు వినయ్, ఏసుకూరు మండలం అరికాయలపాడుకు చెందిన బొమ్మ వేణు ఇద్దరూ ఫ్రెండ్స్. ఈజీ మనీ కోసం ఇద్దరూ ఐదేండ్ల నుంచి గంజాయి స్మగ్లింగ్​చేస్తున్నారు. ఒడిశాకు చెందిన జగన్, ముద్ద రామారావు అనే వ్యక్తుల నుంచి గంజాయి కొని ముంబైలోని కళ్యాణి రాథోడ్, నావీద్, సాధిక్​కు ఎక్కువ ధరకు అమ్ముతూ వస్తున్నారు. ఎప్పటిలాగే జగన్​, రామారావు నుంచి 68 కిలోల గంజాయిని తీసుకుని 31 ప్యాకెట్లుగా తయారుచేశారు. ఓ ట్రాలీ ఆటోలో ‘పుష్ప’ సినిమా తరహాలో చాంబర్లు ఏర్పాటు చేశారు. వాటిలో గంజాయి ప్యాకెట్లు పేర్చి, పైన ప్లాస్టిక్​ కుర్చీలు అమర్చారు. ప్లాస్టిక్ కుర్చీల వ్యాపారం చేస్తున్నట్టుగా నటిస్తూ ఒడిశా నుంచి ఖమ్మం, తొర్రూరు, కొడకండ్ల, జనగామ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తుండగా.. టాస్క్​ ఫోర్స్​ పోలీసులకు సమాచారం అందింది. దేవరుప్పుల మండలం మొండ్రాయి సమీపంలో పోలీసులు వెహికల్​ను ఆపి చెక్​చేశారు. చాంబర్లలో దాచి స్మగ్లింగ్​చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని, వినయ్, వేణును అరెస్ట్ చేశారు. మిగిలిన ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వినయ్​పై గతంలో రెండు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


ఆలేరులో హాష్​ఆయిల్, చౌటుప్పల్​లో గంజాయి
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, చౌటుప్పల్​లో పోలీసులు స్మగ్లర్ల నుంచి హాష్​ఆయిల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్​జిల్లా గూడూరుకు చెందిన అజ్వీరా సూర్య ప్రైవేట్​ఉద్యోగి. కరోనా టైంలో జాబ్​పోవడంతో నాటు సారా తయారుచేసి విక్రయించడం మొదలు పెట్టాడు. గతేడాది గూడూరు ఎక్సైజ్​పోలీసులకు చిక్కడంతో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. జైలులో సూర్యకు  రాము అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. విడుదలయ్యాక ఇద్దరూ కలిసి హాష్​ఆయిల్​కొని విక్రయించడం మొదలుపెట్టారు. 

ఒడిశాలోని మల్కాన్​గిరికి లక్ష్మణ్ అనే వ్యక్తి వద్ద హాష్​ఆయిల్​కొని రాష్ట్రంలో అమ్ముతున్నారు. సూర్య ఎప్పటిలాగే ఒడిశాలో 3 లీటర్ల హాష్​ఆయిల్​కొని శుక్రవారం వరంగల్​కు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి బైక్​పై హైదరాబాద్​కు బయలుదేరాడు. ఆలేరు వద్ద భువనగిరి ఎస్ఓటీ, ఆలేరు పోలీసులు సూర్యను అదుపులోకి తీసుకున్నారు. 3 లీటర్ల హాష్​ఆయిల్​ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏపీ మహారాష్ట్రకు తరలిస్తున్న నాలుగు కిలోల గంజాయిని చౌటుప్పల్ పంతంగి టోల్​ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. 

మహారాష్ట్రలోని సోలాపూర్​కు చెందిన జవేర్, ప్రమోద్, అజినోత్​ఏపీలో గంజాయి కొని మహారాష్ట్రలో అమ్ముతున్నారు. శుక్రవారం కారులో తరలిస్తున్న నాలుగు కిలలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్​చేశారు.