
- వరంగల్ కమిషనరేట్ లో ఇష్టారీతిన ట్రాఫిక్ ఉల్లంఘనలు
- ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్ మెంట్ సిస్టం అమలుకు కసరత్తు
- మొదట సిటీలోని పది జంక్షన్ లలో అమలు
- కొత్త సిస్టమ్ తో క్రైమ్, ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చంటున్న పోలీసులు
హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో కార్లు, బైక్ లపై వెళ్తూ సిగ్నల్ జంప్ చేస్తున్నారా..? హెల్మెట్ పెట్టుకోకుండా, ఓవర్ స్పీడ్ మెయింటేన్ చేస్తున్నారా..? ఇకపై ఎలాంటి ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినా చలాన్ల వాత తప్పదు.! వరంగల్ కమిషనరేట్ లో ట్రాఫిక్ వయోలేషన్స్ ఎక్కువవుతున్న నేపథ్యంలో కొత్త టెక్నాలజీ వినియోగించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో ఎలక్ట్రానిక్ ఎన్ ఫోర్స్మెంట్ సిస్టం (ఈఈఎస్) అమలు చేయనున్నారు. ఈ సిస్టంతో జంక్షన్లలోని సీసీ కెమెరాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వాహనాలకు చలాన్లు జనరేట్ చేయడంతో పాటు ఫొటోలు క్యాప్చర్ చేసి సంబంధిత ట్రాఫిక్ స్టేషన్లకు చేరవేస్తాయి. వాటి ద్వారా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై పోలీసులు మిగతా యాక్షన్ తీసుకోనున్నారు.
ఢిల్లీ, హైదరాబాద్ తరహాలో..
వరంగల్ నగర రోడ్లపై నిత్యం లక్షలాది వెహికల్స్ రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో చాలామంది వాహనదారులు సిగ్నల్స్ జంప్ చేయడం, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకపోవడం, సెల్ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రోడ్లపైనే బండ్లు పార్క్ చేయడం.. ఇలా వివిధ రకాలుగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తుంటారు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కెమెరాలతో చలాన్లు విధిస్తున్నా, వారి కండ్లుగప్పి తప్పించుకునేవాళ్లు కూడా చాలామందే ఉంటున్నారు. ఇకపై అలా తప్పించుకునే ఛాన్స్ లేకుండా ఆటోమెటిక్ గా ఛలాన్లు జనరేట్ చేసేందుకు ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టంను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లో ఈ సిస్టం అమలవుతుండగా, ఇప్పుడు వరంగల్ కమిషనరేట్ లో అమలు చేయనున్నారు.
ఆటోమేటిక్ చలాన్లు, స్టేషన్లకు అలర్ట్స్..
ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టంలో భాగంగా ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) వ్యవస్థతో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారికి చలాన్లు విధించనున్నారు. ఎలాంటి ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినా ఏఎన్పీఆర్ కెమెరాలు వెహికల్ నంబర్ ప్లేట్ ను స్కాన్ చేసి, ఆటోమెటిక్ గా చలాన్ జనరేట్చేయడంతోపాటు ఆ ఫొటోలు, బండి వివరాలను కమిషనరేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు చేరవేస్తాయి. అనుమానాస్పద వాహనాలను కూడా గుర్తించి, సంబంధిత స్టేషన్లకు అలర్ట్స్ కూడా పంపిస్తాయి. దీంతో నేరాల ఛేదన, నియంత్రణకు కూడా ఈ సిస్టం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ట్రై సిటీలోని పది జంక్షన్లలో..
వరంగల్ ట్రై సిటీలోని జంక్షన్లలోని దాదాపు 17 కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లింకప్ అయి ఉన్నాయి. అవి కాకుండా వరంగల్ ట్రైసిటీలో నిత్యం రద్దీ ఎక్కువగా ఉండే పది జంక్షన్లను ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టంకు అనుసంధానం చేయనున్నారు. ఇందులో కాజీపేట, వడ్డేపల్లి, కేయూ, సుబేదారి, అదాలత్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, అశోక, ములుగు రోడ్డు, ఎంజీఎం సర్కిల్, వరంగల్ హెడ్ పోస్టాఫీస్ జంక్షన్లు ఉండగా ఆ తర్వాత మిగతా జంక్షన్లలోనూ అమలు చేసేందుకు
చర్యలు చేపడుతున్నారు.
ఆటోమెటిక్ గా చలాన్లు..
ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టం ఆటోమేటిక్ నెంబర్ రికగ్నిషన్ విధానంతో పారదర్శకంగా చలాన్లు విధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కొత్త టెక్నాలజీతో మ్యాన్ పవర్ వినియోగం కూడా తగ్గుతుంది. ట్రాఫిక్ నియంత్రణ, రూల్స్ బ్రేక్ చేసిన వారికి ఫైన్లు విధించడం, నేరాల ఛేదనకు కూడా ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ, వరంగల్