వరంగల్: వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఆరూరి రమేష్ ప్రకటించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆరూర్ రమేష్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఆరూరి రమేశ్ పనిచేశారు.
వరంగల్ లోక్సభ స్థానంలో బీజేపీ నుంచి బరిలో దిగిన అభ్యర్థి ఆరూరి రమేశ్కు నిరాశే ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్లో కొనసాగిన ఆయన.. గెలిచే టికెట్గా భావించి బీజేపీలో చేరినా ఫలితం మాత్రం దక్కలేదు. కేంద్రంలో మోదీ, బీజేపీ ఇమేజ్తో ఇన్నాళ్లు గెలుపు ధీమాతో ఉన్న ఆయనకు 2024లో లోక్ సభ ఫలితాలు ఊహించని షాక్ఇచ్చాయి. ఆరూరిపై వ్యక్తిగత వ్యతిరేకత ఉండడంతో మోదీ చరిష్మా కూడా పని చేయలేదని పలువురు అంటున్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యేగా 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆరూరి రమేశ్..2023 శాసనసభ ఎన్నికల్లోనూ లక్షకు పైగా మెజారిటీ ఆశించారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి, బీఆర్ఎస్ సర్కారు ఏర్పడితే మంత్రి పదవి పొందాలని ఆశపడ్డారు. కానీ ఆయనపై, అనుచరులపై ఉన్న వ్యతిరేకతతో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ ప్రయత్నాలు చేసినప్పటికీ గులాబీ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మోదీ చరిష్మాతోనైనా గెలవవచ్చనే ఉద్దేశంతో బీజేపీ వైపు చూశారు. బీఆర్ఎస్ఎంపీ టికెట్ఇస్తానన్నా వద్దనుకుని నాటకీయ పరిణామాల మధ్య 2024, మార్చి17న కాషాయ కండువా కప్పుకున్నారు. మొదటిసారి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కావ్య చేతిలో ఓడిపోయారు.
