V6 News

వాటర్ బోర్డులోవాటర్ వాలంటీర్లు.. బండ్లు వాష్ చేస్తే ఫైన్ కట్టాల్సిందే..!

వాటర్ బోర్డులోవాటర్ వాలంటీర్లు.. బండ్లు వాష్ చేస్తే ఫైన్ కట్టాల్సిందే..!
  • నీటిని అక్రమంగా వినియోగిస్తే ఆట కట్టు  
  • బండ్లు కడిగితే కనిపెడతరు
  • మోటర్లు పెడితే గుర్తిస్తరు
  • ఫొటోలు తీస్తరు.. అప్​లోడ్​ చేస్తరు
  • ఆఫీసర్లొచ్చి ఫైన్లేస్తరు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో తాగునీటి వృథా అరికట్టడంతో పాటు అక్రమంగా నీటిని దొంగిలిస్తున్న వారిని గుర్తించేందుకు వాటర్​బోర్డు అధికారులు వాటర్​వలంటీర్లను నియమించనున్నారు. వలంటీర్లుగా స్వచ్ఛంద సంస్థల నుంచి కొందరిని, మరికొందరిని ఐడీ ప్రూఫ్​ఉన్న యువతీ యువకులను ఎంపిక చేసి నియమించాలని భావిస్తున్నారు.  

ఎంపికైన వారు వారికి కేటాయించిన ప్రాంతాల్లో నల్లాలకు ఇల్లీగల్ మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారిని, మంచినీళ్లను బండ్లు కడగడానికి, గార్డెనింగ్​కు వాడుతున్న వారిని గుర్తించి ఫొటో తీసి యాప్ లో అప్​లోడ్​చేస్తారు. వీరిని వాటర్​సేవ్​వలంటీర్​అని పిలుస్తామని, త్వరలో తీసుకురాబోతున్న పానీ యాప్​మొబైల్​అప్లికేషన్​యాక్సెస్​ను వీరికి ఇస్తామని జలమండలి అధికారులు చెప్తున్నారు.  

ఇలా తీస్తరు.. అలా వస్తరు

వాటర్​బోర్డు నియమించిన వలంటీర్​ఫొటో తీసి సదరు ఇంటి నెంబర్​తో పానీ యాప్​లోకి అప్​లోడ్​చేస్తారు. దీంతో అధికారులు వచ్చి కన్స్యూమర్ కనెక్షన్ నెంబర్ పై ఫైన్​వేస్తారు. ఈ విషయాన్ని వినియోగదారుడికి  ఫోన్​ద్వారా సమాచారం ఇస్తారు. తర్వాత వినియోగదారుడి కనెక్షన్ అకౌంట్ కు పెనాల్టీ జమవుతుంది. అలాగే ఈ మొత్తం వచ్చే నెల బిల్లులో చెల్లించేలాగా కొత్త విధానాన్ని రూపొందించారు. 

ఇలా అప్లై చేయండి 

వాటర్​వలంటీర్​కావాలనుకునే వారు వాటర్​బోర్డు వెబ్​సైట్​ద్వారా ఆన్​లైన్​లో వివరాలు నమోదు చేసుకోవాలి. తప్పనిసరిగా ఫొటో ఐడీ ప్రూఫ్ ఉండాలి. వాటర్​బోర్డు అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ www.hyderabadwater.gov.in లోని “క్విక్​లింక్స్​” విభాగంలో “సేవ్​ వాటర్​ వలంటీర్​రిజిస్ట్రేషన్​లింక్  నుంచి దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తుల నుంచి  అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. చురుకుగ్గా పని చేసే వలంటీర్లకు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తారు.

నల్లాలకు మోటార్లు పెట్టి గుంజుతున్నరు..22 మోటార్లు స్వాధీనం..సీజ్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్ బోర్డు పైపులైన్​కు నేరుగా మోటార్లు పెట్టి నీటిని తోడుతున్న 22 మంది మోటార్లను వాటర్​బోర్డు అధికారులు సీజ్​చేశారు. బుధవారం ఓఅండ్ఎం డివిజన్ 22, హైదర్ నగర్ వార్డు పరిసర ప్రాంతాల్లో  నీటి సరఫరా చేస్తున్న టైంలో తనిఖీలు నిర్వహించి 9 మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మంగళవారం రాత్రి 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విజిలెన్స్ టీమ్​సంబంధిత మేనేజర్‌‌‌‌‌‌‌‌తో కలిసి గాయత్రి నగర్ వార్డ్​లో గాయత్రి నగర్ కాలనీ, జ్యోతి నగర్ కాలనీ, గాయత్రి నగర్ ఇండోర్ స్టేడియం కాలనీ ప్రాంతాల్లో   డ్రైవ్ నిర్వహించి 13 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకుంది.

మొదటిసారి పట్టుబడితే మోటార్లు సీజ్​చేస్తామని, రెండోసారి రూ.5 వేలు జరిమానా వేస్తామని చెప్పారు. ఇలాగే కొనసాగితే క్రిమినల్​కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా మోటార్లు బిగించినట్టు తెలిసినా, తక్కువ ప్రెజర్ తో నీళ్లు వచ్చినా, నీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేయాలన్నారు.