బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం..పాక్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు

బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం..పాక్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు
  • భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ విజ్ఞప్తి 
  • త్వరలోనే కొత్త సర్కారు ఏర్పాటు చేస్తామని వెల్లడి 
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి బలూచిస్తాన్ ప్రకటన

న్యూఢిల్లీ:  బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణచివేతలు, నరమేధానికి పాల్పడింది. దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ, భద్రతా బలగాల ద్వారా కిడ్నాప్ లు, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాక్ నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాం” అని ఆయన ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు. 

బలూచిస్తాన్ లో ఉన్న పాక్ బలగాలు, ప్రభుత్వ సిబ్బంది అంతా  వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ‘‘బలూచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును ప్రకటించారు. ప్రపంచం ఇక ఎంత మాత్రం సైలెంట్ గా ఉండొద్దు. ఇకపై బలూచిస్తాన్ పాకిస్తాన్ కాదు. భారత్ సహా ప్రపంచ దేశాలు బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించాలి” అని మీర్ యార్ కోరారు. ఐక్యరాజ్యసమితి బలూచిస్తాన్ ను ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్​బలూచిస్తాన్’గా గుర్తించి, వెంటనే శాంతి పరిరక్షక దళాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. 

బలూచిస్తాన్ కు భారత్ దౌత్య కార్యాలయాన్ని కేటాయించాలని కోరారు. భారతీయులు, ప్రధానంగా ఇండియన్ మీడియా, యూట్యూబర్లు, మేధావులు తమను పాకిస్తానీలుగా కాకుండా బలూచ్ లుగా పిలవాలన్నారు. పీవోకేపై భారత్ కు తాము పూర్తి మద్దతును ఇస్తున్నామని ఈ సందర్భంగా మీర్ యార్ ప్రకటించారు. ఢాకాలో 93 వేల మంది సైనికులతో లొంగిపోయిన అవమానం పాక్ కు మరోసారి జరగకుండా ఉండాలంటే.. పీవోకేను ఖాళీ చేయాలన్నారు. ఇందుకోసం పాక్ పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలన్నారు. కాగా, సోషల్ మీడియాలో ‘రిపబ్లిక్ ఆఫ్​ బలూచిస్తాన్’ పోస్టులు ట్రెండింగ్ అయ్యాయి.