- పర్సనల్ ఇంటరాక్ట్ వీడియో రిలీజ్ చేసిన కాంగ్రెస్
- రాజకీయాలు పక్కనపెట్టి పర్సనల్ విషయాలపై చర్చ
బెంగళూరు : కాంగ్రెస్లో ఎలాంటి విభేదాల్లేవని చూపించేందుకు సీఎం అభ్యర్థులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు కలిసి మాట్లాడుకుంటున్న వీడియోను పార్టీ రిలీజ్ చేసింది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. కొంత సేపు రాజకీయాలు పక్కన పెట్టేసి ఒకరి గురించి మరొకరు పర్సనల్ క్వశ్చన్స్ వేసుకున్నారు. సిద్ధరామయ్య హెల్త్ గురించి డీకే శివకుమార్ ఆరా తీశారు. ఎడమ చేతి వైరల్ ఇన్ఫెక్షన్ గురించి డీకే శివకుమార్కు సిద్ధరామయ్య వివరించారు.
కొద్దిగా పెయిన్ ఉందని చెప్పారు. రెండు చేతులకు వాపు వచ్చినట్లు వివరించారు. ఇప్పుడు తగ్గుతున్నదని డీకేకు తెలిపారు. జ్వరం కూడా వచ్చినట్టుందని డీకే ప్రశ్నించగా.. అవును అని సిద్ధరామయ్య సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత శివకుమార్ హెలికాప్టర్ను పక్షి ఢీకొట్టిన ఘటన నుంచి సిద్ధరామయ్య ఆరా తీశారు. ఇద్దరూ కలిసి ఎంతో సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
పార్టీ ఫస్ట్.. సీఎం పోస్ట్ సెకండ్
కాంగ్రెస్లో ఎలాంటి విభేదాల్లేవని ఇద్దరూ తేల్చి చెప్పారు. తామిద్దరం మంచి దోస్తులమనే సంకేతం ఇచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఐక్యంగా ఉందన్న సంకేతం పార్టీ కార్యకర్తల్లోకి తీసుకెళ్లారు. పార్టీ ఫస్ట్, తర్వాతే సీఎం పోస్ట్ అని శివకుమార్ అంటే.. నా మాట కూడా ఇదే అని సిద్ధరామయ్య చెప్పారు. సీఎం పదవి ఎవరికి ఇచ్చినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇద్దరూ స్పష్టం చేశారు. రాజకీయంగా తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని కుండ బద్దలు కొట్టారు. ఇద్దరం ఆశావహులే అని తేల్చి చెప్పారు. బీజేపీ రద్దు చేసిన అన్ని కాంగ్రెస్ స్కీమ్స్ తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఇందిరా క్యాంటీన్ మొట్టమొదటిది అన్నారు. మహిళా ఓటర్లందరూ కాంగ్రెస్వైపే ఉన్నారంటూ ధీమా వ్యక్తం చేశారు. జగదీశ్ షెట్టర్, లక్ష్మణ్ సవాదిల త్యాగాల గురించి కూడా చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.
