పక్కా ప్లానింగ్​తో సికింద్రాబాద్​ను డెవలప్ చేశాం : పద్మారావు గౌడ్

 పక్కా ప్లానింగ్​తో సికింద్రాబాద్​ను డెవలప్ చేశాం :  పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, వెలుగు: పక్కా ప్లానింగ్​తో సికింద్రాబాద్ సెగ్మెంట్​లో అభివృద్ధి పనులు పూర్తి చేశామని  బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. పదేళ్లలో ఎన్నో సమస్యలు పరిష్కారించామన్నారు. మంగళవారం సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ సామల హేమతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. టీఆర్టీ క్వార్టర్స్​లోని ఉప్పలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ.. సీతాఫల్ మండిలో జూనియర్, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చామన్నారు.

తాగునీటి, సీవరేజ్ సమస్యలను పరిష్కరించామన్నారు. తాగునీటి సరఫరాను పెంచేందుకు మారేడ్ పల్లి, తార్నాక, శాంతినగర్​లో రూ.34 కోట్లతో కొత్తగా రిజర్వాయర్లను నిర్మించామన్నారు. ఈ  ఎన్నికల్లో భారీ మెజార్టీతో హ్యాట్రిక్ సాధిస్తానని పద్మారావు గౌడ్ తెలిపారు. అనంతరం ఎరుకల బస్తీ, బీదల బస్తీలో ఆయన పర్యటించారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.