- టెర్రరిజంపై కలిసి ఫైట్చేద్దాం
- ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు
- 90వ ఇంటర్పోల్ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: టెర్రరిస్టులు, క్రిమినల్స్, అవినీతిపరులు, డ్రగ్స్ ముఠాలకు ఏ దేశం కూడా స్వర్గధామం కాకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వీరి నుంచి ప్రపంచ దేశాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలను మంగళవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో మోడీ ప్రారంభించారు. నాలుగు రోజులు జరగబోయే ఈ మీటింగ్కు 195 దేశాల ఇంటర్పోల్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. టెర్రరిస్టులు, క్రిమినల్స్, డ్రగ్స్ ముఠాలపై పోరాడేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మునుపటి కంటే వేగంగా ప్రమాదాలు ముంచుకొస్తున్నాయన్నారు. కొన్నిదేశాలు ఒంటరిగా పోరాడుతున్నాయని తెలిపారు. కలిసికట్టుగా ముందుకెళ్తేనే నేరాలను కట్టడి చేయొచ్చన్నారు. సేఫ్టీ, సెక్యూర్ ప్రపంచ ఏర్పాటు అందరి బాధ్యత అని గుర్తు చేశారు.
భవిష్యత్తరాలపై తీవ్ర ప్రభావం
ఇప్పుడు నేరాలు నియంత్రించకపోతే.. భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మోడీ అభిప్రాయపడ్డారు. పోలీసులు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సహకారం పెరగాలని, దీని కోసం కొత్త విధానాలు, ప్రొటోకాల్స్ రూపొందించాలన్నారు.
దావూద్ను ఎప్పుడు అప్పగిస్తారు?
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై బ్లాస్ట్స్ మాస్టర్మైండ్ హఫీజ్ సయీద్ను భారత్కు అప్పగించే అవకాశాలు ఉన్నాయా..? అని ఓ న్యూస్ ఏజెన్సీ రిపోర్టర్, పాకిస్తాన్ తరఫున హాజరైన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ మోహసిన్ భట్ను ప్రశ్నించాడు. వారిద్దరు ఎక్కడ ఉన్నారు..? అని క్వొశ్చన్ చేశాడు. దీంతో భట్కు ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాలేదు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ సైగ చేశారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.