హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 12 బిల్లులు ఆమోదించుకున్నామని తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన సమావేశాలు బుధవారం వరకు కొనసాగాయని.. నేటితో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయన్నారు. రెవెన్యూ బిల్లుతో పాటు మొత్తం 12 బిల్లులపై చర్చించి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని తెలిపారు. కరోనా వైరస్, కేంద్ర విద్యుత్ చట్టం, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలపై చర్చించామన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు, పోలీసు, శాసనసభ సిబ్బందిలో కొందరికి కరోనా సోకిందన్నారు. అయితే కొవిడ్ వ్యాప్తి క్రమంలొ బీఏసీ కమిటీ సూచనల మేరకు, అన్ని పక్షాల సభ్యుల విజ్ఞప్తి మేరకు సభను నిరవధికంగా వాయిదా వేయాల్సి వస్తుందని స్పీకర్ ప్రకటించారు. ఈ ఎనిమిది రోజుల పాటు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సభకు సహకరించిన శాసనసభ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.