
హైదరాబాద్, వెలుగు: చట్ట సభల్లో మహిళలకు కల్పించే రిజర్వేషన్లలో ఓబీసీ కోటా కోసం పోరాడుతామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భారత్లో మహిళా బిల్లుతో రాజకీయ రంగంలో మహిళలకు మంచి రోజులు వస్తాయన్నారు. లండన్లో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా ‘మహిళా రిజర్వేషన్లు.. ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.
మహిళా బిల్లును పార్లమెంట్ముందుకు తీసుకురావడంలో 1996లో దేవెగౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ, 2023లో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారన్నారు. బిల్లు ఆమోదం పొందడంలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. అనంతరం మహిళా బిల్లు కోసం ఉద్యమించిన కవితను బ్రిడ్జ్ఇండియా నిర్వాహకులు అభినందించారు.