నస్పూర్, వెలుగు: రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులకు అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను అందిస్తామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల వ్యవసాయ అధికారులు సురేఖ, విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఎఫ్పీవోల ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు.
కల్తీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని నాణ్యమైన విత్తనాలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరి సాగు మాత్రమే కాకుండా, రైతులు లాభదాయకమైన వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపాలన్నారు. ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు అమ్మాలన్నారు.

