
గద్వాల టౌన్, వెలుగు: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధితోనే ఆర్థిక స్థిరత్వం, ప్రాంతీయ సమతుల్యత, సంపద సృష్టి సాధ్యమని ఆర్బీఐ ఆర్థిక సమీకృత అభివృద్ధి విభాగం హెడ్ ముత్యాల జ్ఞాన సుప్రభాత్ తెలిపారు. శుక్రవారం పట్టణంలో ఆర్బీఐ ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికరంగం వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు.
బ్యాంకింగ్ సదుపాయాలు, రుణ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు, ఆర్థిక సంస్థలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఉద్యోగావకాశాలు సృష్టించడంతో పాటు ప్రాంతీయ అసమానతలు తొలగించేలా కొత్త ఆవిష్కరణల దిశగా ఎంఎస్ఎంలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. యూబీఐ హైదరాబాద్ సీజీఎం భాస్కరరావు, నాబార్డ్ జీఎం గణపతి, యూబీఐ డీజీఎం సత్యనారాయణ, జిల్లా పరిశ్రమల అధికారి రామలింగేశ్వర్ గౌడ్, ఎల్డీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.