
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మీడియా మేనేజ్మెంట్పై నిర్వహిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్లో పాల్గొనేందుకు శ్రీలంకకు చెందిన బృందం తెలంగాణకు వచ్చింది. మీడియా నిపుణులతో కూడిన ఈ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సభ్యులు గురువారం సెక్రటేరియెట్ లో మంత్రి పొంగులేటిని కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. జర్నలిస్టుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఎమర్జింగ్ టెక్నాలజీలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ‘‘మా ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నాం.
పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, రూ.500కే సిలిండర్ అందిస్తున్నాం” అని వివరించారు.