కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ… మరణించిన వ్యక్తి మృతదేహాన్ని చూసేందుకు డబ్బులు చెల్లించాలని ఓ ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డిమాండ్ చేసినట్టు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా లో జరిగిందీ సంఘటన. సాగర్ గుప్తా అనే యువకుడు చెప్పిన వివరాల ప్రకారం.. తన తండ్రి గత కొన్ని రోజులుగా వైరస్ సోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఆసుపత్రి సిబ్బంది కాల్ చేసి.. శనివారం అర్ధరాత్రి తన తండ్రి మరణించినట్టు చెప్పారన్నారు. చనిపోయిన సమయంలోనే కాల్ ఎందుకు చేయలేదని ప్రశ్నించగా.. తమ వద్ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదన్నారని చెప్పాడు.
విషయం తెలుసుకొని.. కుటుంబ సభ్యులతో సహ ఆసుపత్రికి చేరుకోగా..మృతదేహాన్ని అంత్యక్రియలకు పంపామని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. షిబ్పూర్ శ్మశానవాటికకు చేరుకోగా మృతదేహాన్ని చూడటానికి రూ .51 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొంత తగ్గించి రూ.31 వేలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లిన ఓ పోలీసు అధికారిని కూడా ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. ఏదైనా ఉంటే తమ ఉన్నతాధికారులతో మాట్లాడాలని వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన మొత్తాన్ని ఫోన్ లో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించగా తమ ఫోన్ను వారు లాక్కెళ్లారని మృతుడి కుటుంబ సభ్యుడు తెలిపాడు
చివరకు తమకు చూపించకుండానే మృతదేహాన్ని దహనం చేశారని, హాస్పిటల్ సిబ్బంది మాత్రం అడ్రస్ తెలియకనే డెడ్బాడీని పంపించలేకపోయామంటూ అదే సమాధానం చెబుతుందని కుటుంబ సభ్యులు అన్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాడు చేస్తామని చెప్పారు.