
హైదరాబాద్, వెలుగు: మామా, అల్లుడు కలిసి తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించేందుకు బనకచర్ల అంశాన్ని వాడుకునే నీచ ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్, హరీశ్ పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. శనివారం సీఎల్పీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉండి, అడ్డగోలుగా వ్యవహరించిన కేసీఆర్, హరీశ్ ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశారని చెప్పారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం ఎవరితో రాజీ పడబోదని స్పష్టం చేశారు. గతంలో గోదావరి జలాల విషయంలో కేసీఆర్ రాజీపడ్డ విషయాన్ని గుర్తు చేశారు.