
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల ముందు బీజేపీ బీసీల ద్రోహిగా నిలిచిపోనుందని విప్ బీర్ల అయిలయ్య అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు.
బీసీ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ రిజర్వేషన్లపై ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే వారిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ సహించరని హెచ్చరించారు.