
IAS.. చాలా చాలా మంది కలల.. చాలా చాలా కష్టపడితే కానీ కాలేం.. ఎంతో కష్టపడి IAS అయిన యంగ్ ఆఫీసర్.. మూడేళ్లకే తనలోని అపరిచితుడిని పరిచయం చేశాడు. 2021 బ్యాచ్ IAS ఆఫీసర్.. 10 లక్షల రూపాయల నోట్ల కట్టలతో అడ్డంగా ఏసీబీకి పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లా సబ్ కలెక్టర్గా పని చేస్తూనే.. కోట్లకు కోట్లు సంపాదించేయాలన్న అత్యాశ.. చివరకు కెరీర్ నాశనానికి దారి తీసింది. ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. త్రిపురలోని కాంచన్ పూర్కు చెందిన ధీమన్ చక్మా 2021 బ్యాచ్ ఆఫీసర్.
ప్రస్తుతం ఒడిషాలోని కలహండి జిల్లా ధరమ్గఢ్లో సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ పని కోసం వచ్చిన స్థానిక వ్యాపారవేత్తను చక్మా రూ.20 లక్షల లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడు. మిగిలిన డబ్బులు ఇవ్వకుంటే యాక్షన్ తీసుకుంటానని వ్యాపారిని బెదిరించాడు. చక్మా బెదిరింపులకు భయపడ్డ సదరు వ్యాపారవేత్త విజిలెన్స్ డైరెక్టరేట్ను ఆశ్రయించాడు. జరిగింది మొత్తం విజిలెన్స్ అధికారులకు చెప్పి చక్మాపై ఫిర్యాదు చేశాడు.
ALSO READ | జస్టిస్ వర్మకు రాజీనామా ఒక్కటే మార్గం!..లేదంటే పార్లమెంట్లో అభిశంసన ద్వారా తొలగింపు
వ్యాపారవేత్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు.. ఐఏఎస్గా ఎంపికైన మూడేళ్లలోనే అవినీతి పడగలిప్పిన చక్మాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగానే సదరు వ్యాపారవేత్తకు డబ్బులిచ్చి చక్మా దగ్గరకు పంపారు. వ్యాపారవేత్త నుంచి చక్మా లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు మెరుపు దాడి చేసి.. చక్మాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఐఏఎస్ ధీమన్ చక్మాపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ తెలిపింది. చక్మా ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
ఐఏఎస్ అధికారి ధీమన్ చక్మా ఎవరు..?
దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యమైన ఐఏఎస్కు ఎంపిక కావడం చాలా కష్టం. ఎన్నో సంవత్సరాలు కఠోర శ్రమ చేస్తే కానీ ఐఏఎస్ జాబ్ కొట్టలేరు. దేశంలోని ఎంతో మందికి ఐఏఎస్ జాబ్ ఒక కల. అలాంటి ఐఏఎస్ జాబ్కు ఎంపికైన ధీమన్ చక్మా.. ఉద్యోగంలో చేరిన మూడేళ్లకు అవినీతి దుకాణం తెరవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎవరీ ధీమన్ చక్మా..? అసలు ఆయనది ఎక్కడ..? అని పలువురు లంచగొండి అధికారి వివరాలను ఆరా తీస్తున్నారు.
త్రిపురలోని కాంచన్ పూర్కు చెందిన ధీమన్ చక్మా 2021 బ్యాచ్ ఆఫీసర్. అతను అగర్తలలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఐఏఎస్ కావడానికి ముందు ఒడిశాలోని మయూర్ భంజ్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారిగా పనిచేశాడు. యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ పోస్ట్కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఒడిషాలోని కలహండి జిల్లా ధరమ్గఢ్లో సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.