జస్టిస్ వర్మకు రాజీనామా ఒక్కటే మార్గం!..లేదంటే పార్లమెంట్‌‌లో అభిశంసన ద్వారా తొలగింపు 

జస్టిస్ వర్మకు రాజీనామా ఒక్కటే మార్గం!..లేదంటే పార్లమెంట్‌‌లో అభిశంసన ద్వారా తొలగింపు 

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మకు రాజీనామా ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. లేదంటే పార్లమెంట్‌‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఆయనను తొలగిస్తారని పేర్కొంటున్నారు. జస్టిస్ వర్మ రాజీనామా చేస్తే ఆయనకు పెన్షన్, ఇతర బెనిఫిట్స్‌‌ అందుతాయని.. అలా కాకుండా పార్లమెంట్ తొలగిస్తే ఎలాంటి బెనిఫిట్స్ అందవని అంటున్నారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్రపతికి హైకోర్టు జడ్జి సింపుల్ లెటర్ రాస్తే సరిపోతుంది. దానికి ఎలాంటి ఆమోదం అక్కర్లేదు. జడ్జి తాను ఏ తేదీలోపు తప్పుకుంటాననేది లేఖలో పేర్కొనాలి. ఒకవేళ మనసు మార్చుకుంటే ఆ తేదీలోపు రాజీనామా లేఖను వెనక్కి తీసుకోవచ్చు. మరోవైపు పార్లమెంట్‌‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే, కమిటీ విచారణకు జస్టిస్ వర్మ హాజరుకావాల్సి ఉంటుంది. అప్పుడు తాను తప్పుకుంటానని నోటిమాటగా చెప్పినా, దాన్ని రాజీనామాగా పరిగణిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇదీ కేసు.. 

జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పని చేసిన టైమ్‌‌లో ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణ చేపట్టి, జస్టిస్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమేనని తేల్చింది.

దీంతో జస్టిస్ వర్మను రాజీనామా చేయాలని సీజేఐ కోరారని, కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదని సమాచారం. ఈ క్రమంలోనే జస్టిస్ వర్మను తొలగించాలని రాష్ట్రపతి, ప్రధానికి సీజేఐ లేఖ రాశారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌‌సభ లేదా రాజ్యసభలో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.