దవాఖానలో పట్టించుకోలె
మనోజ్ అన్న సాయి ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో కరోనా పేషెంట్లను సరిగా ట్రీట్ చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నయి. రెండ్రోజుల క్రితం మరణించిన జర్నలిస్ట్ మనోజ్ ఉదంతమే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. తనను డాక్టర్లు పట్టించుకోవడంలేదని వేరే హాస్పిటల్కు షిఫ్ట్ చేయాలని మనోజ్ పంపిన మెసేజ్లు కలకలం రేపుతున్నయి. గాంధీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, పేషెంట్లను పట్టించుకునేవారే లేరని మనోజ్ అన్న సాయి ఆరోపించారు. ‘మనోజ్కు రెండ్రోజులు జ్వరం రావడంతో ఈ నెల 3న మధ్యాహ్నం ఫీవర్ హాస్పిటల్కు వెళ్లాం. శాంపిల్స్ తీసుకుని ఇంటికెళ్లమన్నారు. రాత్రి 10.30కు పాజిటివ్ వచ్చిందని, హాస్పిటల్కు రావాలని ఫోన్ చేశారు. వెంటనే ఫీవర్ హాస్పిటల్కు వచ్చాం. గంటన్నర ప్రాసెస్ తర్వాత గాంధీకి షిఫ్ట్ చేశారు. అక్కడ గంటన్నర వెయిట్ చేశాం. ఏడో ఫ్లోర్లోని ఫీమెల్ సెప్టిక్ వార్డులో బెడ్పై పడుకోమని స్టాఫ్ చెప్పారు. డాక్టర్లు వచ్చి చెక్ చేయలేదు. ఉదయానికి మనోజ్ పరిస్థితి దిగజారింది. ఇక్కడి నుండి వెళ్లిపోదాం అన్నడు. ఉదయం 11 గంటల దాకా ఎవరూ రాలేదు. ఇద్దరు నర్సులు వచ్చి మనోజ్ పరిస్థితి బాలేదని షిఫ్ట్ చేయాలని చెప్పి వెళ్లిపోయారు. 12 గంటలకు డాక్టర్లు వచ్చి ఐసీయూకి షిఫ్ట్ చేస్తామన్నారు. సాయంత్రం 4.30కు వచ్చి ఐసీయూలో బెడ్లు లేవని చెప్పారు. గట్టిగా అడిగితే ఐసీయూలోకి తీసుకెళ్లారు. అక్కడ గంటన్నర పాటు స్ట్రెచర్ పైనే కూర్చోబెట్టారు. మనోజ్ కొలిగ్స్ హెల్త్ మినిస్టర్ ఈటలకు సమాచారం ఇచ్చాక ఐసీయూలో బెడ్ ఇచ్చారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందన్నా కూడా ఆక్సిజన్ పెట్టలేదు. గాంధీలో పరిస్థితులు చూసే నా తమ్ము డు సగం చచ్చిపోయాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి ఉంటే…
మనోజ్ ఫ్రెండ్ ఒకరికి కరోనా సోకింది. రెండ్రోజుల ముందే మనోజ్ అతన్ని కలిసిండు. ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ వ్యక్తుల కాంటాక్ట్ పర్సన్స్ను ట్రేస్ చేసి టెస్ట్ చేయాలి. మనోజ్ విషయంలో ఇవేమీ జరగలేదు. తనంతట తానే వెళ్లి పాజిటివ్ వ్యక్తితో కాంటాక్టైన విషయం చెప్పి టెస్ట్ చేయించుకున్నడు. హైరిస్క్ కాంటాక్ట్స్కు సింప్టమ్స్తో సంబంధం లేకుండా టెస్టులు చేయాలని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ చెబుతున్నయి. ఇప్పటికే ఓ జబ్బుతో బాధపడుతున్న మనోజ్ హైరిస్క్ కాంటాక్ట్ కిందకే వస్తారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి ట్రీట్మెంట్ అందిస్తే మనోజ్ పరిస్థితి వేరేగా ఉండేదేమోననే అతని సన్నిహితులు చెప్పారు.
For More News..