కొత్త పార్టీపై పొలిటికల్ స్పెక్యులేషన్స్.. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరెళ్తారు?

కొత్త పార్టీపై పొలిటికల్ స్పెక్యులేషన్స్.. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరెళ్తారు?

తెలంగాణలో  ఏర్పాటయ్యే కొత్త పార్టీ వ్యూహంలో పాలు పంచుకుంటున్నదెవరన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 20 మంది కీలక నేతలు కొత్త పార్టీ ఏర్పాటులో పాలు పంచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీళ్లంతా పొంగులేటి, జూపల్లితో రహస్యంతా మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రజాబలం ఉండి.. మూడు పార్టీల్లో ఇమడలేక పోతున్నవారు కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి అసంతృప్తులు, బీఆర్ఎస్ లో మొదటి నుంచి కొనసాగుతూ పదవులు దక్కని వారు కొత్త పార్టీ వైపు చూస్తున్నట్టు సమచారం. 

ఆ వ్యాఖ్యల మర్మమేమిటి..?

ఇటీవల బీజేపీ సీనియర్ నేత ఒకరు చేసిన కామెంట్స్ కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్నదనే వాదనకు బలం చేకూర్చుతున్నాయి. పొంగులేటి, జూపల్లి కృష్ణారావును తాను బీజేపీలో చేరాలని ఆహ్వానించానని, వారు తనకే కౌన్సెలింగ్ ఇస్తున్నారనడం గమనార్హం. ఆ నేతకు వాళ్లేం కౌన్సెలింగ్ ఇచ్చారు..? ఏం మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కొనసాగింపుగా జూపల్లి కృష్ణారావు బీజేపీకి చెందిన నలుగురైదుగురు నేతలు తనతో టచ్ లో ఉన్నారన్నారు. ఆ నలుగురైదుగురు నేతలు ఎవరన్నది కమలనాథులను మదిని తొలచివేస్తున్నది. దీనిపై రకరకాల విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. కొందరిపై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నాయి. దీనిపై సదరు నేతలు తామ కాదంటూ ఖండనలు కూడా ఇస్తున్నారు.  

కారు దిగేదెవరు..?

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఇప్పటి వరకు పదవులు దక్కని నేతలు, టికెట్లు రావనుకొనే వారు కొత్త పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో వర్గపోరు ఉంది. ఓటమి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థికి, ప్రస్తుత ఎమ్మెల్యేకు మధ్య పొసగడం లేదు. పలు సెగ్మెంట్లలో బహిరంగ విమర్శలు, పరస్పరం దాడుల దాకా వెళ్లింది. సిట్టింగులకే టికెట్లు ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రటిస్తున్నా..? ఇస్తారా..? లేదా..? అనే ఆందోళన పలువురు ఎమ్మెల్యేలను వెంటాడుతున్నది. దీనిపై కేసీఆర్ ఇదివరకే వార్నింగ్స్ కూడా ఇచ్చారు. తాను సర్వేలు చేయించానని, తన వద్ద చిట్టా ఉందని చురకలు కూడా అంటించారు. అదే గుబులుతో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు తాజాగా తమ పరిస్థితి ఏమిటని సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఇలాంటి నేతలంతా కొత్తగా ఏర్పడబోయే పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. దాదాపు పది మంది వరకు పొంగులేటి, జూపల్లితో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.  

చేయి విడిచేదెవరు..?

కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో భారీ చేరికలు ఉంటాయని, పరిస్థితి పూర్తిగా మారిపోతుందని ప్రచారం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.  ముఖ్యులెవరూ కాంగ్రెస్ లో చేరలేదు. పదేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోవడం, లీడర్ గా కంటిన్యూ కావడానికి ఆర్థికపరమైన సమస్యలు వస్తుండటంతో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలన్న తలంపుతో ఉన్న వారు, టికెట్ వస్తుందో..? రాదో..? అనే డౌట్ తో ఉన్న వారంతా కొత్త పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. దాదాపు ఐదారుగురు కీలక నేతలు కొత్త పార్టీ వ్యూహంలో పాలుపంచుకుంటున్నట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం.. గెలుపు అవకాశాలు.. ప్రజలు ఎలా ఆకట్టుకోవాలి..? జనం ఏం కోరుకుంటున్నారు..? అనే అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.