
లింక్ లన్నీ ఫర్టిలైజర్ షాపు చుట్టే..
మరో రెండు కుటుంబాలకు హైదరాబాద్ లింక్
పెరుగుతున్న వైరస్ పట్టించుకోని ఆఫీసర్లు
స్వచ్ఛందంగా షాపుల మూసివేత
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో ఎందుకింతలా కరోనా కేసులు పెరిగినయ్.. లాక్ డౌన్ టైంలో ప్రశాంతంగా ఉన్న జిల్లాలో డేంజర్ పరిస్థితులు ఎలా వచ్చినయ్..వీటన్నంటికి ప్రధాన కారణం ఆ ఫీసర్ల నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. చిన్న జిల్లాగా ఉన్న ఇక్కడ పెద్ద సంఖ్యలో కేసులు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇంత జరుగుతున్నా.. ఆ ఏం కాదులే.. ‘‘టెస్టులు చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ కేసులు వస్తున్నయ్..లేకుంటే తెలిసేదే కాదు’’ అని బాధ్యత గల ఆఫీసర్లు కొట్టి పారేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేసులను దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ పై పోరులో కీలకంగా ఉండాల్సిన జిల్లా స్థాయి ఆఫీసర్లు ఫీల్డ్ లెవల్లో పర్యవేక్షించడం లేదంటున్నారు.
ఇలాగైతే జాగ్రత్త ఎలా
జిల్లాలోని పాజిటివ్ కేసులలో 80 శాతం కేసులు జనగామ టౌన్ లోనే ఉంటున్నాయి. ప్రైమరీ కాంటాక్టుల గుర్తింపు సరిగా లేదు. ఇప్పటివరకు జిల్లాలో ఎంతమంది ప్రైమరీ కాంటాక్టులను హోంక్వారంటైన్ లో ఉంచారు..? ఎంత మందికి టెస్టులు చేశారనే విషయంలో క్లారిటీ లేదు. జనాలు ఆందోళన చెందుతారనే కారణం చూపెడుతూ పరిస్థితిని ఇంత దూరం తీసుకువచ్చారు. ఇప్పటికైనా జనాల్లో చైతన్యం తెచ్చే పనులు ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. ఒకటి రెండు కేసులున్నప్పుడే యంత్రాంగం కట్టుది ట్టమైన చర్యలు తీసుకుంటే పరిస్థితి కంట్రోల్లో ఉండేది. ఆఫీసర్లు రిలాక్స్ మోడ్ లో ఉండేసరికి పట్టణంలోని షాపులు దగ్గర కోవిడ్ రూల్స్ ఎవరూ పాటించలేదు.
హైదరాబాద్ తోనే..
జనగామ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు జనాలు, ఉద్యోగులు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. పలు కంపెనీల వారు బిజినెస్ పనులపై నిత్యం వచ్చి వెళ్తుంటారు. ఇదే క్రమంలో పెద్ద ఫర్టిలైజర్ షాపుకు వచ్చిన కంపెనీ ప్రతినిధుల ద్వారా షాపు ఓనర్ కు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఓనర్ కు కోవిడ్ లక్షణాలు కనిపించినా పెద్దగా పట్టించుకోలేదని మెడికల్ ఆఫీసర్లు అంటున్నారు. మిగిలిన పార్టనర్లు కనీసం మాస్కులు కూడా ధరించలేదని.. సదరు దుకాణంలో కౌంటర్ పై కూర్చుని అమ్మకాలు జరిపారని కలెక్టరేట్ లో జరిగిన రివ్యూ మీటింగ్ లో డీఎంహెచ్వో మహేందర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వివరించారు. తర్వాత మిగిలిన ఓనర్లకు వారి కుటుంబ సభ్యులకు, పనిచేసే వర్కర్లకు సోకింది. వీరి నుంచి మండలాల రైతులకు వ్యాపించింది. దీంతో సదరు ఫర్టిలైజర్ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హాస్పిటల్స్ ఎఫెక్ట్
జనగామ టౌన్ లో ఆదివారం పాజిటివ్ వచ్చిన రెండు కుటుంబాలకు హైదరాబాద్ హాస్పిటల్ లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఫైనాన్స్ వ్యాపారి హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ కు వెళ్లివచ్చిన తర్వాత వైరస్ బారిన పడ్డారని ఆయన ద్వారా కుటుంబానికి వచ్చినట్లు యంత్రాంగం భావిస్తోంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి, అతడి భార్య ఇటీవల హైదరాబాద్ లోని హాస్పిటల్ కు వెళ్లి బంధువులను పరామర్శించి వచ్చిన తర్వాత వైరస్ బారిన పడ్డారనే అంచనాకు వచ్చారు.
పచ్చబొట్టు తెచ్చిన తంటా
కొడకండ్లలో పాజిటివ్ వచ్చిన ఓ మహిళ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గార్డెన్ లో పచ్చబొట్టు పొడుస్తూ జీవనం కొనసాగిస్తోంది. గార్డెన్ కు వచ్చే ఔత్సాహికులకు బొట్లు పొడిచే క్రమంలో ఆమె అనారోగ్యానికి గురైంది. టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. ఈమె ద్వారా ఎంతమందికి వచ్చిందో తెలియని పరిస్థితి ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
స్వచ్ఛంద లాక్ డౌన్
ఆఫీసర్ల చర్యల పై భరోసా కరువైన నేపథ్యంలో జనగామలోని వ్యాపార వర్గాలు స్వచ్ఛంద లాక్ డౌన్ చేపట్టాయి. కరోనా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసిన అఖిల పక్షాలు, వ్యాపార వర్గాలు సోమవారం నుంచి లాక్ డౌన్ లో పాల్గొంటూ షాపులు మూసి వేశాయి. ఈ నెల 30 వరకు సంపూర్ణ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. మిగిలిన షాపులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరుస్తున్నారు.
సేఫ్ లేని ఐసోలేషన్
కరోనా పాజిటివ్ పేషెంట్లను ఆఫీసర్లు హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. ఇక వీరి బాగోగులను కింది స్థాయి సిబ్బందికి వదిలేస్తున్నారు. దీంతో పేషెంట్ల వద్దకు ఏఎన్ ఎంలు, ఆశా వర్కర్లు వెళ్తున్నారు. తమకు కనీస రక్షణ కరువైందని వారు అంటున్నారు. సరైన మాస్కులు, కిట్లు లేవని భయం భయంగా వెళ్లి మెడిసిన్ ఇచ్చి.. వివరాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నరు. ఇక ఐసోలేషన్లో ఉండే వారిపై ఎటువంటి నిఘా ఉండడం లేదు. ఇంట్లోనే వారు ఉండడం.. కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్ అంటున్నప్పటికీ నిత్యావసరాలకు బయటకు రాక తప్పడం లేదు. జనగామ జిల్లాలో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నా జిల్లా హాస్పిటల్ లోని ఐసోలేషన్ సెంటర్లో ఒక్క పేషెంట్ ను కూడా పెట్ట లేదు.