BONALU 2025: ఆషాఢంలోనే అమ్మకు బోనం ఎందుకు సమర్పించాలి...

BONALU 2025: ఆషాఢంలోనే అమ్మకు బోనం ఎందుకు సమర్పించాలి...

తెలంగాణలో ఏ గల్లీ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు సిద్దమయ్యారు.  ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా.. లష్కర్​ బోనాలకు జనాలు సిద్దమయ్యారు.  అమ్మకు ఆషాఢమాసం అంటే ఎందుకు ప్రీతి..అసలు అమ్మవారికి ఆషాఢమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పించాలి..మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం. .  .!

డప్పు చప్పుళ్లు,శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆషాడమాసమంతా ఊరూరా బోనాల జాతరే. ప్రత్యేకంగా హైదరాబాద్ లో పండుగ కోలాహలం గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. పంటలు బాగా పండాలని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని.. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తల్లి కాపాడాలని...అమ్మవారికి భక్తులు బోనం సమర్పిస్తారు.  ఎంతో శుచిగా అమ్మకు కొత్త కుండలో వండి.. పసుపు.. కుంకమతో అలంకరించి... సున్నం.. పువ్వులు.. వేపకొమ్మలను కుండ చుట్టూ పెట్టి పైన దీపారాధాన చేస్తారు. తరువాత ఈ కుండను తలపై పెట్టుకొని డప్పు చప్పుళ్ల తో.. ఊరేగింపుగా  వెళ్లి అమ్మకు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. 

 తెలంగాణ ప్రజల మోముల్లో అవ్యక్తమైన ఆనందం వెల్లివిరుస్తుంది. తెలంగాణ పండుగ సంబరమవుతుంది. హుషారెత్తించే పాటవుతుంది.  తెలంగాణ  సంప్రదాయానికి చిహ్నమైన  ఆషాఢం  బోనాన్ని  స్త్రీలే త‌యారు చేస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాల‌మ్మ, పెద్దమ్మ..గ్రామ దేవతలను తమను చల్లంగా చూడలమ్మా అంటూ వేడుకుంటారు. తమ గ్రామానికి, కుటుంబానికి ఎలాంటి ఆపద రాకూడదని మెుక్కుకుంటారు. 

ఆషాడంలోనే ఎందుకు

మహిళలు పసుపుతో అలంకారం చేసుకొని... నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకొని.. ముందుగా అమ్మవారికి  తయారు చేసిన నైవేద్య పాత్రకు నమస్కారం చేసి తలపై పెట్టుకుంటారు. ఇంట్లో సందడి సంతరించుకుంటుంది.బోనాలు తీసుకెళుతున్న మహిళలపై అమ్మవారు ఉంటుందని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది .. అందుకే  ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించగానే వారి పాదాలపై భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు.

ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని  భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మను తమ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలా భావించి భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను, మేకపోతులను  బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.  

 పూర్వకాలంలో వైద్యవిజ్ఞాన శాస్త్రం పరిణతి చెందక ప్రచారం  కాలంలో పల్లెటూర్లలో ప్లేగు, కలరా, మశూచి, వంటి అంటు వ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే స్మశానాలుగా మారిపోయేవి. దానినే గత్తర వచ్చింది అనేవారు.ఈ వైపరీత్యాల నుంచి కాపాడాలంటూ గ్రామదేవతలను ఆరాధిస్తారు. ఆ ఆరాధనకు ఉపయోగించే వస్తువులన్నీ వైరస్ ను నిర్మూలించేవే.  వేపాకులు, పసుపునీళ్లు ఇవన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయి. బోనాల తయారీలో వీటన్నింటిని ఉపయోగించడం వలన ఆషాఢమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం వెనుక సైంటిఫిక్​ రీజన్​ కూడా ఉందని కొంతమంది చెబుతున్నారు. . .