హైదరాబాద్, వెలుగు: కోర్టు ఉత్తర్వుల్ని అమలుచేయకపోతే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ నెల 27న జరిగే విచారణ నాటికి ట్రాన్స్జెండర్కు రిజర్వేషన్ కల్పించాలన్న గత ఉత్తర్వుల అమలుపై వివరణ ఇవ్వాని రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రాన్స్జెండర్కు ఓబీసీ కోటాలో పీజీ మెడికల్ సీటు ఇవ్వాలని గత నెలలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ కోరిన కేటగిరీ(గైనకాలజీ)లో సీటు రాని పక్షంలో మెరిట్ ఆధారంగా ఏ కేటగిరీలో సీటు వస్తుందో చెప్పాలంది. కాగా, కోర్టు ఉత్తర్వులు అమలు కాలేదంటూ దాఖలైన పిటిషన్ను గురువారం హైకోర్టు విచారించింది.
ఈ సందర్భంగా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అభినంద్కుమార్ షావలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుల బెంచ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గవర్నమెంట్ జీవో ఇచ్చే ఏర్పాట్లల్లో ఉందని, వారం రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. అంగీకరించిన డివిజన్ బెంచ్ విచారణ
ఈ నెల 27కి వాయిదా వేసింది.