- చిన్న పిల్లలకు ఇంతేసి పని చెప్తరా?
- ఆన్లైన్ క్లాసులపై ప్రధాని మోడీకి ఆరేండ్ల పాప కంప్లైంట్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లు మూతపడ్డయ్.. స్టూడెంట్లు ఇండ్లకే పరిమితం కాగా, టీచర్లు ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు. ఈ ఆన్లైన్ చదువులతో చాలామంది స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. స్మార్ట్ఫోన్ లేక కొందరు.. ఇంటర్నెట్ సిగ్నల్ దొరకక ఇంకొందరు, రెండూ ఉన్నా గంటల తరబడి క్లాసులు వినలేక మరికొందరు అనారోగ్యం పాలైతున్నరు. ఆన్లైన్ క్లాసుల వల్ల తాను ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకంగా ప్రధానికే కంప్లైంట్ చేసిందో ఆరేండ్ల చిన్నారి. దీన్నంతా ఓ జర్నలిస్టు వీడియో తీసి ట్విట్టర్లో పెట్టడంతో వైరల్గా మారింది. ఒక్క రోజులో 57 వేల మంది ఈ వీడియోను చూడగా.. 5 వేల మంది లైక్ చేసిన్రు. ఈ విషయంపైన సీరియస్గా దృష్టిపెట్టాల్సిందేనని చాలామంది రీట్వీట్ చేసిన్రు. పిల్లలకు ఆన్లైన్ క్లాసుల బెడదను తప్పించాలని కోరిన్రు.
వీడియోలో చిన్నారి మాటలు..
కాశ్మీర్కు చెందిన ఆరేండ్ల చిన్నారి ఆన్లైన్ క్లాసులపై ఓ వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీకి కంప్లైంట్ చేసింది. ‘పదింటి నుంచి మధ్యాహ్నం రెండింటి దాకా ఇంగ్లిష్, మ్యాథ్స్, ఉర్దూ, ఈవీఎస్ ఆన్లైన్ క్లాసులు వినాలె. ఆ తర్వాత కంప్యూటర్ క్లాసు కూడా ఉంటుంది. అదికూడా అయిపోతే స్కూల్ వర్క్ ( చేతులతో చూపిస్తూ) చాలా ఉంటుంది. నాలాంటి చిన్న పిల్లలకు రోజూ ఇంతేసి వర్క్ చెప్పడమేంటి మోడీ సాబ్? అయినా ఏం చేయగలం! అస్సలామాలేకుం మోడీ సాబ్. బై’ అని వీడియోలో చెప్పింది.
A six-year-old Kashmiri girl's complaint to @PMOIndia @narendramodi regarding long hours of online classes and too much of school work. pic.twitter.com/S7P64ubc9H
— Aurangzeb Naqshbandi (@naqshzeb) May 29, 2021