
ఎల్ బీ నగర్,వెలుగు: భార్యతో గొడవపడిన భర్త ఆమెపై పగ పెంచుకున్నాడు. భార్య పేరుతో ఫేస్ బుక్ క్రియేట్ చేసి అందులో అసభ్యకర ఫొటోలను అప్ లోడ్ చేసిన ఆ భర్తను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కాల్వకోలేకి చెందిన పెంజర్ల రవీందర్(27) ఎల్ బీనగర్ కి చెందిన ఓ యువతిని 2015 లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత రవీందర్ భార్యతో కలిసి ఎల్ బీనగర్ లో ఉన్నాడు. రవీందర్ భార్య పేరుతో ఓ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి ఫేస్ బుక్ పేజ్ ఓపెన్ చేశాడు. కొంతకాలం తర్వాత రవీందర్ సెల్ఫోన్ చూసిన భార్య..అతడు వేరే అమ్మాయిలతో చాట్ చేస్తున్నట్టు గమనించింది. దీంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. రవీందర్ తాను పనిచేస్తున్న జాబ్ మానేసి..భార్యను వదిలేసి సొంతూరికి వెళ్లాడు.
ఆ సమయంలో తనను మోసం చేశాడని సరూర్ నగర్ పీఎస్ లో రవీందర్ పై అతడి భార్య కంప్లయింట్ చేసింది. ఈ విషయంలో భార్యపై పగపెంచుకున్న రవీందర్ గతంలో ఆమె పేరుతో ఓపెన్ చేసిన ఫేస్ బుక్ పేజ్ లో ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసిన అసభ్యకర ఫొటోలు, వీడియోలను అప్ లోడ్ చేశాడు. భార్యను కాల్ గర్ల్ గా ప్రచారం చేస్తూ ఆమె ఫొటోలను కూడా ఫేస్ బుక్ లో పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోలీసులు రవీందర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా.. సమాజంలో తన భార్య పరువు తీయాలని ఇలా చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కేసును ఛేదించిన ఇన్స్ పెక్టర్ జలంధర్ రెడ్డి టీం ను ఉన్నతాధికారులు అభినందించారు.