భర్త వేధిస్తున్నడని భార్య భైఠాయింపు

 భర్త వేధిస్తున్నడని భార్య భైఠాయింపు
  • భర్త వేధిస్తున్నడని భార్య భైఠాయింపు
  • 8 పెండ్లిళ్లు చేసుకున్నదన్న భర్త
  • మహబూబాబాద్​లో హైడ్రామా

మహబూబాబాద్​ అర్బన్, వెలుగు : వాళ్లిద్దరూ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు.. అబ్బాయిది ఆంధ్రా అయితే..అమ్మాయిది  మహబూబాబాద్​ జిల్లా...ఇద్దరూ బెంగళూరులో జాబ్స్​ చేస్తున్నారు. కొన్ని కారణాలతో నాలుగేండ్ల కింద భర్త ఆమెను వదిలేశాడు. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ, మంగళవారం సాయంత్రం సదరు అమ్మాయి మహబూబాబాద్​ పోలీస్​స్టేషన్ ​ఎదుట బైఠాయించింది. దీంతో పోలీసులు బెంగళూరులో ఉన్న భర్తకు కబురుపెట్టడంతో వచ్చి ఏం జరిగిందో పోలీసులకు చెప్పాడు.

 పెండ్లిళ్ల విషయం చెప్పలే..

కృష్ణా జిల్లా గంపలగూడెంకు చెందిన అబ్బాయి హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్ ​ఇంజినీర్​. కాగా, మహబూబాబాద్​ జిల్లాకు చెందిన యువతి కూడా హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ జాబ్​ చేస్తోంది. సదరు అబ్బాయిని 2018లో ఓ మాట్రిమోని సైట్​లో చూసి పెండ్లి చేసుకుంది. తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయి అక్కడే ఉద్యోగాలు చేసేవారు. రెండు నెలల పాటు కాపురం సజావుగా సాగింది. ఈ టైంలో అమ్మాయి తరుచూ ఫోన్‌లో కోర్టు విషయాల గురించి మాట్లాడుతుండడాన్ని ఆమె భర్త గమనించాడు. అడిగితే గొడవ పెట్టుకునేది. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా ఇది వరకే ఎనిమిది పెండ్లిళ్లు చేసుకుందని, వాటికి సంబంధించిన కేసులే కోర్టుల్లో నడుస్తున్నట్టు తెలుసుకున్నాడు.  తనకు విడాకులు కావాలని చెప్పి విడిగా ఉంటున్నాడు.  

కట్​ చేస్తే మంగళవారం సాయంత్రం ఆ అమ్మాయి మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ప్రత్యక్షమై బైఠాయించింది. తన భర్త వేధిస్తున్నాడని న్యాయం చేయాలని కోరింది. దీంతో వారు అతడిని బెంగళూరు నుంచి పిలిపించారు. మహబూబాబాద్​ వచ్చిన అతడు ఆమె ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎవరిని పెండ్లి చేసుకుంది? వారి నుంచి ఎన్ని డబ్బులు తీసుకుంది అన్న విషయాలను చెప్పాడు. తనను కూడా డబ్బులివ్వాలని బ్లాక్​మెయిల్​చేస్తోందని ఆరోపించాడు. దీంతో ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సెలింగ్​ ఇచ్చి పంపించారు.