ప్రియుడి కోసం భర్తనే కిడ్నాప్ చేయించిన భార్య

ప్రియుడి కోసం భర్తనే కిడ్నాప్ చేయించిన భార్య

ప్రియుడి మోజులో పడి ఓ భార్య తన భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్‌ చేయించింది. మూడు గంటల్లో కేసును ఛేదించిన మార్కెట్‌ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 2012లో హైదరాబాద్ మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్‌ వాజీద్, అప్షియా బేగం(24)లకు వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. షేక్‌ వాజీద్‌ (31) బస్టాప్‌ ప్రాంతంలోని ఓ చెప్పుల షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అప్షియాబేగం సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండటంతో ముషీరాబాద్‌కు చెందిన క్యాటరింగ్‌ నిర్వహించే ఆసిఫ్‌ పరిచయం అయ్యాడు.

పరిచయం కాస్తా..ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది..ప్రియుడిపై మోజుతో భర్తకు విడాకులిచ్చి పెళ్లి చేసుకోవాలని  నిర్ణయించుకుంది. భర్త షేక్ వాజీద్ ను విడాకులు కోరగా పిల్లలు ఉన్నారని భర్త విడాకులకు ఒప్పుకోలేదు. దీంతో ప్రియుడితో పాటు మరో నలుగురితో కలిసి భర్తను షాపులో ఉండగానే బలవంతంగా కిడ్నాప్ చేసి ముషీరాబాద్ కు తీసుకెళ్ళి విడాకుల కాగితం బలవంతపు సంతాకలు పెట్టించారు.

వాజీద్‌ సాయంత్రం 6గంటల సమయంలో కిడ్నాప్‌నకు గురికాగా 8గంటల సమయంలో షాపు యజమాని మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కిడ్నాప్‌ తీరును పరిశీలించారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి బాధితుడి సెల్‌ఫోన్‌ టవర్‌ను ఆధారంగా వాజీద్‌ను  బంధించిన ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ముషీరాబాద్‌లో వాజీద్‌ను గుర్తించి రక్షించారు. అప్షియాతో పాటు ఇమ్రాన్‌ అహ్మద్, జాఫర్‌ను పోలీసులు అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు ఆసిఫ్‌తో పాటు ఇర్ఫాన్‌ అహ్మద్, మహమూద్‌ పరారీలో ఉన్నారు.