కోరుట్ల/జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లాలో పలు చోట్ల ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఈత వనాలు దగ్ధమయ్యాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్, కోరుట్ల మండలం అయిలాపూర్, సంగెం, మోహన్రావుపేట గ్రామాల శివారుల్లో శుక్రవారం మంటలు చెలరేగి ఈత వనాలు దగ్ధమయ్యాయి. మెట్లాచిట్టాపూర్ లో దాదాపు 2 వేల చెట్లు, అయిలాపూర్ లో 400, సంగెంలో 600, మోహన్ రావుపేటలో 500 ఈత చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అలాగే బోర్వెల్, పైప్లైన్, విద్యుత్ వైర్లు కూడా మంటల్లో కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పివేశారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో సుమారు 100 తాటి, 50 ఈతచెట్లు కాలిపోయాయి.
శంకరపట్నం : శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామంలో మంటలు అంటుకొని పశుగ్రాసం, వ్యవసాయ మోటార్ల వైర్లు, స్టార్టర్ డబ్బాలు దగ్ధమయ్యాయి. కల్వల ప్రాజెక్ట్ శిఖం భూమిలో వరి సాగు చేసిన రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పలువురు భావిస్తున్నారు.
