- ఇండియాతో తొలి రెండు టీ20లకు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- అందుబాటులో ఉండనన్న గేల్
ఆంటిగ్వా: వెటరన్ ఆటగాళ్లు సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్ వెస్టిండీస్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.వచ్చే నెల మూడో తేదీ నుంచి ఇండియాతో జరిగే మూడు టీ20ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఆడే 15 మంది సభ్యుల జట్టును విండీస్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టులో నరైన్, పొలార్డ్ చోటు దక్కించుకున్నారు. స్పిన్నర్ నరైన్ రెండేళ్ల క్రితం విండీస్ తరఫున చివరి టీ20 ఆడగా, పొలార్డ్ గతేడాది నవంబర్లో ఇండియాతో జరిగిన సిరీస్లో బరిలోకి దిగాడు. విండీస్ టీ20 టీమ్కు కార్లోస్ బ్రాత్వైట్ నాయకత్వం వహించనున్నాడు. కెనడాలో జరిగే జీ టీ20 సిరీస్ కోసం యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఈ సిరీస్కు దూరం కాగా, గాయం వల్ల వరల్డ్కప్ మధ్యలోనే తప్పుకున్న ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ తిరిగి చోటు దక్కించుకున్నాడు. నికోలస్ పూరన్ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఎంపిక చేయగా, అతని బ్యాకప్గా అన్క్యాప్డ్ ప్లేయర్ ఆంథోనీ బ్రాంబుల్ను తీసుకున్నారు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్కప్ను దృష్టిలో ఉంచుకుని ఈ జరిగే సిరీస్కు అనుభవంతో పాటు యువ రక్తంతో నిండిన జట్టును ఎంపిక చేశామని సెలెక్టర్లు తెలిపారు. మూడో టీ20 ఆడే జట్టును ఆగస్టు 6న ప్రకటిస్తామన్నారు.
వెస్టిండీస్ జట్టు(తొలి రెండు టీ20లకు):
కార్లోస్ బ్రాత్వైట్(కెప్టెన్), సునీల్ నరైన్, కీమో పాల్, ఖారి పియెర్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్(కీపర్), రోమన్ పావెల్, ఆండ్రీ రసెల్, ఒషేన్ థామస్, ఆంథోనీ బ్రాంబుల్(కీపర్), జాన్ క్యాంబెల్, షెల్డన్ కొట్రెల్, హెట్మయర్, ఎవిన్ లూయిస్.
