- రంగంలోకి సెబీ
బిజినెస్ డెస్క్, వెలుగు: యూట్యూబ్ ద్వారా షేరు మానిప్యులేషన్కు పాల్పడిన వారిపై సెబీ చర్యలు తీసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించి, షేర్లను పెద్ద మొత్తంలో పెంచి , భారీ లాభాలను సంపాదించిన వారికి నోటీసులు ఇచ్చింది. వీరు సంపాదించిన లాభాలను తీసుకోవడమే కాకుండా, మార్కెట్లో ఎంటర్ అవ్వకుండా బ్యాన్ వేసింది. టీవీ ఛానెల్స్ను క్రియేట్ చేసే కంపెనీలు సాధ్నా బ్రాడ్కాస్ట్ లిమిటెడ్, షార్ప్లైన్ బ్రాడ్కాస్ట్ షేర్లను కొంత మంది భారీగా పెంచారు. ఈ కంపెనీలు తోపు అనేటట్టు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి, రూ. కోట్లు ఖర్చు పెట్టి ప్రమోట్ చేశారు. ఈ కంపెనీలు భారీ ఆర్డర్లను దక్కించుకున్నాయని, అదానీ గ్రూప్ వీటిని టేకోవర్ చేయనుందనే తప్పుడు వార్తలను నాలుగు య్యూటూబ్ ఛానెల్స్ ప్రమోట్ చేశాయి. సాధ్నాకు సంబంధించిన వీడియోలను ‘ది అడ్వైజర్’, ‘మనీ వైజ్’ ప్రమోట్ చేయగా, షార్ప్లైన్ లిమిటెడ్కు సంబంధించిన వీడియోలను ‘మిడ్క్యాప్ కాల్స్’, ‘ప్రాఫిట్ యాత్ర’ లు ప్రమోట్ చేశాయి. వీటి క్రియేటర్లు, కంపెనీ ప్రమోటర్లు, పెద్ద షేరు హోల్డర్లు, ఈ షేర్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ పెంచిన వారి మధ్య సంబంధాలున్నాయని సెబీ పేర్కొంది. వీరంతా కలిసి పంపింగ్–డంపింగ్ స్కీమ్ను నడిపారని తెలిపింది. ‘ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలని, భారీగా డబ్బులు సంపాదించొచ్చని ఈ య్యూటూబ్ ఛానెల్స్ ఇన్వెస్టర్లకు సలహాలిచ్చాయి. ఈ వీడియోలను ప్రమోట్ చేసేందుకు గూగుల్ యాడ్స్ కోసం రూ. ఆరు కోట్ల వరకు ఖర్చు చేశాయి. ఈ యూట్యూబ్ ఛానెల్స్ క్రియేటర్లు తమ వీడియోలను అప్లోడ్ చేసిన తర్వాత సాధ్నా, షార్ప్లైన్ షేర్లను కొనడం మొదలుపెట్టారు. వీటి రేట్లు పెరిగిన తర్వాత లాభాలకు అమ్ముకున్నారు. ఈ కంపెనీల ప్రమోటర్లు, ఒక శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న షేరు హోల్డర్లపై కూడా చర్యలు తీసుకుంటున్నాం’ అని సెబీ ప్రకటించింది.
పెద్ద దందా..
యూట్యూబ్ ఛానెల్స్ మిడ్కాప్ కాల్స్ కిందటేడాది జనవరిలో, ప్రాఫిట్ యాత్ర సెప్టెంబర్, 2021 లో క్రియేట్ అయ్యాయి. ది అడ్వైజరీ, మనీవైజ్ ఛానెల్స్ను 2021, జులైలో క్రియేట్ చేశారు. ఫ్రాపిట్ యాత్రను మంజరి తివారి క్రియేట్ చేయగా, మిగిలిన ఛానెల్స్ను మనిష్ మిశ్రా క్రియేట్ చేశారు. వీరికి 3.5 లక్షల కంటే ఎక్కువ మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. వీరు తమ వీడియోలపై కామెంట్ సెక్షన్ను బంద్ చేసి, ప్రమోట్ చేశారని సెబీ పేర్కొంది. కిందటేడాది ఏప్రిల్, 27 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఈ కంపెనీల షేర్లను పరిశీలించి సాధ్నాకు సంబంధించి 31 మందికి, షార్ప్లైన్కు సంబంధించి 26 మందికి నోటిసులిచ్చింది. మూడు గ్రూపుల్లో వీరిని సెబీ పెట్టింది. మొదటి గ్రూప్లో తప్పుడు కంటెంట్ను క్రియేట్ చేసిన వారిని, రెండో గ్రూప్లో భారీగా షేర్లను అమ్మిన పెద్ద షేరుహోల్డర్లను. మూడో గ్రూప్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ను పెంచిన వారిని పెట్టింది.
సెబీ ఆదేశాలు..
ఈ ఇష్యూకి సంబంధించి సుమారు 50 మందికి సెబీ నోటీసులు ఇచ్చింది. వీరు మార్కెట్లో డైరెక్ట్గా, ఇన్డైరెక్ట్గా పాల్గొనకుండా ఆదేశించింది. ప్రస్తుతం వీరికి ఉన్న పొజిషన్లన్నింటినీ క్లోజ్ చేసేస్తారు. షేర్లను మానిప్యులేట్ చేసి పొందిన లాభాలను సెబీ లాక్కుంటుంది. వీరు బ్యాంకుల దగ్గర ఎస్క్రో అకౌంట్ను ఓపెన్ చేసి 15 రోజుల్లో ఈ లాభాలు వేయాల్సి ఉంటుంది. ఈ నోటీసులు పొందిన వారికి బ్యాంకులు కొత్త అప్పులివ్వవు. వీరు తమ ఆస్తులను అమ్మడానికి వీలులేదు.
పంప్ అండ్ డంప్ స్కీమ్కు వ్యతిరేకంగా సెబీ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్స్ అదిరిపోయాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్తో హై రిటర్న్స్ వస్తాయని ఇన్వెస్టర్లకు మోసగాళ్లు ఆశ కలిపిస్తున్నారు. మానిప్యులేటర్లకు ఇలాంటి స్కామ్స్ ఈజీగా మారిపోయాయి.
- నితిన్ కామత్, జెరోధా ఫౌండర్
స్కీమ్లో బాలీవుడ్ యాక్టర్
బాలీవుడ్ యాక్టర్ ఆర్షద్ వార్సి, ఆయన భార్య మారియా గోరెట్టి వార్సికి సెబీ నోటిసులు పంపించింది. వీరు ఈ స్టాక్ మానిప్యులేషన్ స్కీమ్లో భాగం పంచుకున్నారని తెలిపింది. కిందటేడాది ఏప్రిల్ 27- సెప్టెంబర్ 30 మధ్య సాధ్నా, షార్ప్లైన్ షేర్లలో భారీగా ఇన్వెస్ట్ చేసి ఆర్షద్ రూ.29.43 లక్షలు, మారియా రూ.37.56 లక్షలు ప్రాఫిట్ సంపాదించారని సెబీ పేర్కొంది. వీరు వాల్యూమ్స్ను పెంచిన గ్రూప్లో ఉన్నారు.