పింఛన్ ఇవ్వట్లేదని హరీష్ రావు సభలో మహిళ ఆందోళన

పింఛన్ ఇవ్వట్లేదని హరీష్ రావు సభలో మహిళ ఆందోళన

మెదక్ జిల్లా మనోహరాబాద్లో ఆసరా పింఛన్ల కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. తనకు పింఛన్ రావట్లేదని ఓ మహిళ ఆందోళన చేసింది. మంత్రి హరీశ్ రావు సభా వేధికపై ఉండగానే తమ గోడును చెప్పుకునే ప్రయత్నం చేసింది. పోలీసులు మహిళను అడ్డుకుని సర్దిచెప్పేందుకు యత్నించారు. లబ్ధిదారులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. 

అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి 

టీఆర్ఎస్ ప్రభుత్వానికి కుల, మతాల భేదం లేదని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిపాలనలో లబ్ధిదారులకు75 రూపాయల పెన్షన్ మాత్రమే వచ్చేదని, అది కూడా ఒక గ్రామంలోని కొంతమందికే వచ్చేదని చెప్పారు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం 2016 రూపాయల పెన్షన్ అందజేస్తూ లబ్ధిదారులకు ఆసరాగా ఉంటోందన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కూడా బలోపేతం చేసి, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఆడపిల్లల వివాహాలకు ఏ ప్రభుత్వం అందించని సహాయం ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు.