జనగామ అర్బన్, వెలుగు: జనగామ ఎంసీహెచ్లో శిశువును ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. శిశువును ఎత్తుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన మహిళను అక్కడున్న వారు వెంబడించి పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే.. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామానికి చెందిన కీర్తన, కరుణాకర్ దంపతులకు జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో ఈ నెల 2న మగ బిడ్డ పుట్టాడు.
బుధవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో రఘునాథపల్లి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన తాళ్లపెల్లి జ్యోతి అనే మహిళ హాస్పిటల్కు వచ్చింది. మగ శిశువును అపహరించి బయటకు వెళ్లింది. ఆటోలో జనగామ వైపు వెళ్తుండగా శిశువు బంధువులు వెంబడించి పట్టుకున్నారు. శిశువును తీసుకుని ఆమెకు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై భరత్ సంఘటన స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
