
అధికార పార్టీకి చెందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తమను, తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. భూ కబ్జాలను అడ్డుకున్నందుకు తన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మిర్యాలగూడ పట్టణానికి చెందిన బంటు మణెమ్మ అనే మహిళ హైదరాబాద్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు, మిర్యాలగూడ టౌన్ పోలీసులు ఒక్కటై తమను వేధిస్తున్నారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్నామని.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోందని ఆమె తెలిపారు.
ఎమ్మెల్యే, అతని అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను అడ్డుకుని బాధితులకు అండగా నిలిచిన తన భర్త, న్యాయవాది బుచ్చిబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఒత్తిడితో మిర్యాలగూడ పోలీసులు తమ ఇంట్లోకి చొరబడి ముఖ్యమైన కాగితాలు, పాస్ పుస్తకాలు , దస్తావేజులతో పాటు కీలకమైన పత్రాలను లాక్కెళ్లారని ఆమె ఆరోపించారు. తన భర్త, కుమారుడిని పోలీసు స్టేషన్ కి తీసుకువెళ్లి విచక్షణా రహితంగా కొట్టారని మండిపడ్డారు.
అక్రమ కేసులు పెట్టిన మిర్యాలగూడ పోలీసులు, వేధింపులకు కారణమైన ఎమ్మెల్యే భాస్కర్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.