
హైదరాబాద్: భర్తతో గొడవ పడిన ఓ మహిళ ఆవేశంతో పది నెలల పసికందును ఎత్తుకుని రెండంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన తల్లి మృతి చెందగా.. 10 నెలల చిన్నారికి గాయాలయ్యాయి. బంజారాహిల్స్ పరిధిలోని శ్రీరామ్ బస్తీలో సోమవారం రాత్రి జరిగిందీ ఘటన. పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ మహిళ దూకడం గుర్తించిన స్థానికులు రక్తగాయాలతో కొట్టుకుంటున్న తల్లీ కుమార్తెలను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడలేక మంగళవారం రాత్రి తల్లి కన్నుమూయగా.. 10 నెలల పసిబిడ్డ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.
మాటా మాటా పెరిగి.. భర్త చేయి చేసుకోవడంతో..
బీహార్కు చెందిన భీమల్ కుమార్ పొట్ట కూటి కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఇతనికి సొంత రాష్ట్రానికి చెందిన ఆర్తి (22) తో పెళ్లి అయ్యింది. వీరికి పదినెలల పాప ఉంది. లాక్డౌన్ తర్వాత ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో భర్త చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆర్తి భర్తపై కోపంతో తన 10 నెలల కూతురును ఎత్తుకుని రెండంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకేసింది. కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడిన తల్లీ కూతుళ్లను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో దాదాపు 24 గంటలపాటు మృత్యువుతో పోరాడిన ఆర్తి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచింది. వీరి 10 నెలల పసికందు పరిస్థితి కూడా విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పోలీసులు భీమల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
For More News..
అమ్మాయిలా చాటింగ్ చేసి.. 70 మందిని మోసం చేసిన యువకుడు
లైసెన్స్ లేని వాళ్లకు బండిస్తే రూ. 5 వేలు ఫైన్