
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పుణ్యమా అని.. ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు చూడాల్సివస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా అమలు చేసిన ఫ్రీ బస్సు పథకాన్ని మహిళలు వందకు వంద శాతం ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగా.. ఎన్నో వింతలు విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు ఓ మహిళ బస్సనే వ్యాపార దుకాణంగా మార్చేసింది.
ఫ్రీ బస్సు పథకం ఎఫెక్ట్తో ఓ మహిళా రైతు అదిరిపోయే ఐడియా ఆలోచించింది. తాను పండించిన కూరగాయలను.. మార్కెట్కు తీసుకెళ్తున్న క్రమంలో... బస్సులోనే దుకాణం తెరిచేసింది. ఎలాగూ బస్సులో 70 శాతం మంది మహిళలే ఉండటంతో.. ఆమె కూరగాయలు మార్కెట్ చేరేలోపే అమ్ముడైపోయి.. వ్యాపారం గట్టిగానే గిట్టుబాటైంది.
మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో.. బస్సు నిండా ప్రయాణికులతో ప్రయాణం సజావుగా సాగుతోంది. మార్గమధ్యంలో ఓ కూరగాయలు అమ్మే మహిళ బుట్టలో కూరగాయలతో బస్సు ఎక్కింది. ఆమెను చూసిన బస్సులోని మహిళలు.. ఏమేం కూరగాయలున్నాయని మాటలు కలిపారు. అదే క్రమంలో రేట్లు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎలాగూ.. ఇంటికి వెళ్లిన తర్వాత కూరగాయల కోసం భర్తలను మార్కెట్లకు పంపాలనుకున్నారో.. లేదా తక్కువ ధరకే వస్తున్నాయనుకున్నారో.. ఏమో తెలియదు కాని .. ఆమెతో బేరాలు మొదలుపెట్టారు. చాలా మంది అడగటంతో.. ఆ మహిళా రైతు త్రాసు తీసి.. దుకాణం తెరిచేసింది. అడిగినవాళ్లందరికీ అక్కడే తూకం వేసి అమ్మింది.
అడిగిన మహిళలకు అక్కడే తూకం వేసి కూరగాయలు అమ్మడం మొదలు పెట్టింది. దీనిని అదే బస్సులో వెళుతున్న ఓ ప్రయాణికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొద్ది రోజుల్లో బస్సుల్లో క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తారేమో అని, ఏది ఏమైనా మహిళకు మంచి గిరాకీ తగిలిందని, ఈ ఫ్రీ బస్సు కొనసాగినంత కాలం ఆర్టీసీ బస్సుల్లో ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందోనని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.