
మెదక్, వెలుగు: అన్ని చేస్తున్నమంటున్నరు కానీ మంచినీళ్లు వస్తలేవు.. ఇండ్లు ఇస్తలేరు.. పింఛన్ అందడం లేదంటూ మహిళలు మంత్రి సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు మున్సిపల్ కౌన్సిలర్లు మంత్రి హరీశ్రావు, మెదక్ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మెదక్లోని స్థానిక గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి స్పీచ్అయిపోయిన తరువాత కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం చేపట్టారు. హాల్లో వేదిక మీద ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో పక్కన డైనింగ్హాల్లో కూర్చున్న మహిళలు ఒక్కొక్కరుగా నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ముందుగా రాంనగర్ గల్లీకి చెందిన పోచమ్మఅనే వృద్ధురాలు లేచి పింఛన్ ఒక్కటి ఇస్తే సరిపోతుందా గల్లీల సమస్యలు పట్టించుకోరా అని ప్రశ్నిస్తూ స్టేజీవైపు వెళ్లే ప్రయత్నం చేసింది.
ఇది గమనించిన మున్సిపల్మాజీ వైస్చైర్మన్అశోక్, టీఆర్ఎస్లీడర్హమీద్, జీవన్రావు వచ్చి ఆమెను సముదాయించారు. ఈ సందర్భంగా ఆమె ఇండ్లళ్లకు పోదాం పండ్రి నీళ్లు వస్తున్నయేమో మీరే సూద్దురు అని టీఆర్ఎస్ లీడర్లతో అంది. మరోవైపు కిష్టమ్మ అనే వృద్ధురాలు తనకు 60 ఏండ్లున్నా పింఛన్ వస్తలేదని, తన భర్త చనిపోయాడని, తనకెవరూ దిక్కులేరని, నేనెట్లా బతకాలంటూ కంటతడి పెట్టింది. పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్నా, ఎవరికి చెప్పినా లాభం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నోళ్లకే అన్నీ వస్తన్నాయి, ఏమీ లేనోళ్లను పట్టించుకుంటలేరు.. మేం ఎప్పటికి ఇట్లనే ఉండాల్నా అంటూ బోరున విలపించింది. ఇంటికాడ ఖాళీ జాగా ఉన్నోళ్లకు ఇళ్లు కట్టుకునేటందుకు లోన్ఇప్పిస్తమని చెప్పిన్రు కానీ ఎవ్వలకు ఇచ్చిన్రు చెప్పుండ్రి అని కళావతి అనే మహిళ ప్రశ్నించింది. తన ఇల్లు కూలిపోయిందని, ఉండేందుకు ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్నోళ్లు లేరని దాయరకు చెందిన భారతి అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్హులైన వారందరికి పింఛన్లు శాంక్షన్చేపిస్తం, ఇంటింటికి మంజీరా నీళ్లు సప్లై చేపిస్తం అన్నరు కానీ ఏండ్లు గడుస్తున్నా పింఛన్లు లేవు, నీళ్లు లేవని కొందరు యువకులు మండిపడ్డారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పుండ్రి అన్నీ పరిష్కరిస్తాం, లొల్లి పెట్టకుండి అంటూ టీఆర్ఎస్ లీడర్లు వారిని సముదాయించారు. మంత్రి, ఎమ్మెల్యే తదితరులు కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయే వరకు మహిళలు హాల్లోకి వెళ్లకుండా ఆపారు