కాకా స్ఫూర్తితో పనిచేస్త ..పేదల సంక్షేమానికి కృషి చేస్త: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాకా స్ఫూర్తితో పనిచేస్త ..పేదల సంక్షేమానికి కృషి చేస్త: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • మాలలు ఆత్మగౌరవంతో బతకాలి 
  • అందరూ కలసికట్టుగా ఉండాలని పిలుపు
  • జాతీయ షెడ్యూల్ కులాల, హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మంత్రికి సన్మానం

హైదరాబాద్, వెలుగు: తన తండ్రి కాకా వెంకటస్వామి స్ఫూర్తితో పని చేస్తానని, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మాలలు ఆత్మగౌరవంతో బతకాలని, అందరూ కలసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. మాలలకు రిజర్వేషన్ల పెంపు, నిధుల కోసం కృషి చేస్తానని చెప్పారు.

మాలలకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో ప్రస్తావించానని, బడ్జెట్‌‌లో ఎస్సీలకు 20 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌‌లోని బంజారా భవన్‌‌లో జాతీయ షెడ్యూల్ కులాల, హక్కుల పరిరక్షణ సంఘం, దళిత, కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి వివేక్‌‌ను సన్మానించారు. అంతకుముందు పటాకులు పేలుస్తూ, బ్యాండ్‌‌మేళంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. తనకు కార్మిక శాఖ రావడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీ ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ‘‘మాల ఉద్యోగులకు వేదిక లేదు. ఈ కార్యక్రమం చేపట్టిన సూర్యకరణ్‌‌కు కృతజ్ఞతలు. జాతి అభివృద్ధి కోసం కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారు. ఈ మీటింగ్‌‌లో ఎంతో మంది ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు.

 పేదలకు అండగా ఉంటూ, నిరంతరం వాళ్లకు అందుబాటులో ఉండాలని కాకా చెప్పేవారు. మంత్రి పదవి వచ్చినా గతంలో ఉన్నట్టే అందరికీ అందుబాటులో ఉంటాను” అని చెప్పారు. ‘‘మాల కమ్యూనిటీ అభివృద్ధి కోసం అందరూ ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలి. అప్పుడు మిగతా కమ్యూనిటీల లాగే మన కమ్యూనిటీ కూడా మరింత బలోపేతం అవుతుంది. మనదాంట్లో చాలా సంఘాలు ఉన్నాయి. 

అవన్నీ ఒక్కతాటి పైకి రావాలి. గతంలో నేను ఎంతో కష్టపడి పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో మాలల ఆత్మగౌరవ సభ నిర్వహించాను. అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ మీటింగ్ నా రాజకీయ జీవితంలో పెద్ద రిస్క్ అని అనిపించింది. అయినప్పటికీ భయపడకుండా ముందుకెళ్లాను. నా బలం ఏంటో నాకు తెలుసు” అని తెలిపారు. 

కాకా.. గొప్ప నాయకుడు: జేబీ రాజు 

కాకా వెంకటస్వామి.. గొప్ప నాయకుడు అని ఆలిండియా దళిత సేవ అధ్యక్షుడు జేబీ రాజు అన్నారు. ఆయన లక్షలాది మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించారని గుర్తు చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు ప్రఖ్యాతలు పొందిన నేత అని కొనియాడారు. తనకు బీహెచ్‌‌ఈఎల్‌‌లో కాకా తొలిసారి పరిచయం అయ్యారని, అప్పటి నుంచి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. 

‘‘గతంలో కాకా కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తే.. ఇప్పుడు ఆయన కుమారుడు వివేక్ కూడా కార్మిక శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. కాకా స్ఫూర్తితో వివేక్ ముందుకెళ్తున్నారు. ట్రస్టు ఏర్పాటు చేసి పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు” అని ప్రశంసించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ నియంతలా వ్యవహరించారని.. కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్‌‌మెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

మాదిగ దండోరా ఆధ్వర్యంలో సన్మానం.. 

మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌‌ను ఆదివారం మాదిగ దండోరా ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా మాదిగ దండోరా నేత సతీశ్ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మైనింగ్‌‌లో దళితులకు అవకాశం ఇవ్వాలని కోరారు. ‘‘ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారమైంది. ఎస్సీలకు నాలుగు మంత్రి పదవులు, స్పీకర్ పదవి ఇచ్చారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం” అని తెలిపారు.