హైదరాబాద్: ఇప్పటికే ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్కు అర్హత సాధించిన ఇండియా విమెన్స్ హాకీ జట్టు ఇప్పుడు ఫైనల్ బెర్త్పై గురిపెట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే క్వాలిఫయర్స్ సెమీస్లో ఇటలీతో తలపడనుంది. సెమీస్తో పాటు ఫైనల్లోనూ సత్తా చాటి టైటిల్ను గెలవాలనే ఏకైక లక్ష్యంగా టీమిండియా అడుగులు వేస్తోంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో ఏడు పాయింట్లు సాధించిన ఇండియా గ్రూప్–బిలో టాప్ ప్లేస్లో నిలిచింది.
పూల్–ఎలో ఇటలీ నాలుగు పాయింట్లతో రెండో ప్లేస్ను సాధించింది. దాంతో సెమీస్ మ్యాచ్లో ఇటలీపై ఇండియాదే పైచేయి కానుంది. నాలుగు గోల్స్తో టాప్ స్కోరర్గా ఉన్న ఫార్వర్డ్ నవనీత్ కౌర్ అద్భుతమైన ఫామ్లో ఉండటం ఇండియాకు కలిసొచ్చే అంశం. వేల్స్తో జరిగిన చివరి మ్యాచ్లో హ్యాట్రిక్ను సాధించింది. ఇటలీ ఎక్కువగా ఫెడెరికా కార్టాపై ఆధారపడుతుండటం మైనస్గా మారింది. ముఖాముఖి రికార్డులోనూ ఇండియానే మెరుగ్గా ఉంది. 2012 నుంచి తలపడిన ఏడుసార్లలో ఇండియా ఐదుసార్లు గెలవగా, ఇటలీ ఒక మ్యాచ్లో నెగ్గింది. ఒకటి డ్రా అయ్యింది.
