ప్రపంచ నేతల సంతాపం..భారత ప్రజలకు మద్దతుగా నిలుస్తామని ప్రకటన

ప్రపంచ నేతల సంతాపం..భారత ప్రజలకు మద్దతుగా నిలుస్తామని ప్రకటన

మాస్కో/బ్రస్సెల్స్/మాలి:   అహ్మదాబాద్‌‌‌‌లో జరిగిన విమాన ప్రమాదంపై ప్రపంచ నేతలు సంతాపం తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలకు సంఘీభావంగా నిలుస్తామని ప్రకటించారు. మాన ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం విషాదకరం. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని పుతిన్ తన సందేశంలో తెలిపారు. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌‌‌‌లో కూలిపోతున్న దృశ్యాలు హృదయవిదాకరంగా ఉన్నాయని యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. ఈ ప్రమాద వార్త తనను తీవ్రంగా బాధించిందన్నారు. అలాగే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్,  నేపాల్ మాజీ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ గురువారం భారత ప్రజలకు సంఘీభావం తెలిపారు.

మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని కెనడా ప్రధాని కార్నీ అన్నారు. ప్రమాదంలో ఒక కెనడియన్ కూడా ఉన్నాడు. భయంకరమైన విమాన ప్రమాదం గురించి తెలిసి, తాను, తన భార్య క్వీన్ కెమిల్లా తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యామని కింగ్ చార్లెస్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలుపుతూ బకింగ్‌‌‌‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది.